8 నుంచి 16 వరకూ విద్యా సంస్థలకు సెలవులు

ABN , First Publish Date - 2022-01-04T08:45:56+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకూ జనవరి 8 నుంచి 16 దాకా సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

8 నుంచి 16 వరకూ విద్యా సంస్థలకు సెలవులు

  • ఒమైక్రాన్‌పై ఆందోళన వద్దు
  • అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు
  • హోం ఐసోలేషన్‌ కిట్లు కోటికి పెంచండి
  • రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు సిద్ధం చేసుకోండి
  • వైద్య సిబ్బంది ఖాళీ అయితే 15 రోజుల్లో భర్తీ
  • మరో 60 బస్తీదవాఖానాలు ఏర్పాటు చేయండి
  • వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌
  • ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ అక్కర్లేదు: అధికారులు


హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకూ జనవరి 8 నుంచి 16 దాకా సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులనూ పటిష్ఠపరచాలని, ప్రస్తుతం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ పడకలు, మందులు, పరీక్షా కిట్లకు అదనంగా అవసరం మేరకు ఇతోధికంగా సమకూర్చుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్‌ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి సీఎంకు వివరించారు. ప్రస్తుతానికి లాక్‌ డౌన్‌ అవసరం లేదని... ప్రజలందరూ మాస్కులు ధరించి, కొవిడ్‌ నిబంధనలను పాటించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. ఒమైక్రాన్‌ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేద థని.. అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉందని చెప్పారు.


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని దాదాపు 99ు పడకలను ఇప్పటికే ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్ప త్తి సామర్థ్యం కేవలం 140 టన్నులే కాగా.. దాన్ని 324 టన్నులకు పెంచుకోగలిగామన్నారు. ఇప్పుడు 500 టన్నులకు పెంచడానికి అవసరమైన చర్యలు తీ సుకోవాలని సూచించారు. హోంఐసోలేషన్‌ చికిత్స  కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటికి, టెస్టింగ్‌ కిట్లను 35 లక్షల నుంచి రెండు కోట్లకు పెంచాలని, దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని,  ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సూచించారు. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా.. ఖాళీ అయిన పాత కలెక్టరేట్‌ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం కేటాయించాలని ఆదేశించారు. డయాలిసిస్‌ సేవలను మరింత విస్తరించాలని  సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా...

హైదరాబాద్‌లో సామాన్యులకు నాణ్యమైన వైద్య ేసవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని ఆదేశించారు. హెచ్‌ఎండిఎ పరిధిలోని కంటోన్మెంట్‌ జోన్‌లో వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను.. అలాగే రసూల్‌ పురలో 2, ఎల్‌.బి.నగర్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, జల్‌పల్లి, మీర్‌ పేట, పిర్జాదీగూడ, బోడుప్పల్‌, జవహర్‌ నగర్‌, నిజాంపేట్‌లలో ఒక్కొక్కటి చొప్పున, వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 4, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్‌, మంచిర్యాల, తాండూర్‌, వికారాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్‌, గద్వాల్‌, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్‌, బొల్లారం, అమీన్‌ పూర్‌, గజ్వేల్‌, మెదక్‌లో ఒక్కొక్కటి చొప్పున, మహబూబ్‌ నగర్‌లో 2, నల్గొండలో 2, రామగుండంలో 2, ఖమ్మంలో 2, నిజామాబాద్‌లో 3, కరీంనగర్‌లో 2.. మొత్తం కలిపి 60 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌ రెడ్డి, హన్మంత్‌ షిండే,  సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఎ.ఎం.రిజ్వి,  డీహెచ్‌ గడల శ్రీనివాసరావు, రమేశ్‌ రెడ్డి, గంగాధర్‌, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-04T08:45:56+05:30 IST