హైదరాబాద్ : హోం ఐసొలేషన్లో ఉండి చనిపోతే...
ABN , First Publish Date - 2021-04-22T18:05:25+05:30 IST
ఇళ్లలో మరణించిన కొవిడ్ రోగుల అంత్యక్రియల నిర్వహణకు
హైదరాబాద్ సిటీ : ఇళ్లలో మరణించిన కొవిడ్ రోగుల అంత్యక్రియల నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్గా నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్లో ఉంటూ చనిపోయిన వారి దహన సంస్కారాలు జీహెచ్ఎంసీ నిర్వహిస్తోందని ఓ అధికారి తెలిపారు. అందుకయ్యే వ్యయాన్ని సంస్థే భరిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకు మాత్రమే జీహెచ్ఎంసీ ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. బాధితులు 040-2111 1111, 91546 86549, 9154686558 కొవిడ్ కంట్రోల్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
చావుకు రూ.30-40 వేలు
కొవిడ్ మృతదేహాలకు ఎక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి..? అన్న దానిపై చాలా మందికి స్పష్టత లేదు. ఇదే అదనుగా కొన్ని సంస్థలు చావునూ వ్యాపారం చేస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.30-40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక బాధితులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనంగా మారనుంది.