ఉపాధి కూలీలపై తేనె టీగల దాడి

ABN , First Publish Date - 2022-05-27T06:04:46+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి.

ఉపాధి కూలీలపై తేనె టీగల దాడి
ముంచంగిపుట్టు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న బాధిత గిరిజనులు

- 20 మందికి గాయాలు

ముంచంగిపుట్టు, మే 26: జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో మారుమూల బరడ పంచాయతీ హంసబంద గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... హంసబంద గ్రామంలో 45 మంది గిరిజనులు గ్రామానికి సమీపంలో ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి సమీపంలోని అడవులోంచి అకస్మాత్తుగా తేనె టీగల గంపు వచ్చి వారిపై దాడి చేశాయి. పనులు చేస్తున్న కూలీలు పని ముట్లను వదిలేసి పరుగులు తీశారు. కొందరు సమీపంలోని కొండలు ఎక్కగా, మరికొందరు గ్రామంలోకి పారిపోయారు. అయినప్పటికీ విజయ, మల్లన్న, శుక్ర, భగత్రామ్‌, నాగమణి, పార్వతమ్మ, సురేశ్‌, ధనుంజయ్‌లతోపాటు మరో 12 మంది తేనె టీగల దాడిలో గాయాలపాలయయ్యారు. వారిని హుటాహుటిన 108, ఇతర వాహనాల్లో ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్‌ జ్ఞానేశ్వరి, సిబ్బంది బాధిత గిరిజనులకు వైద్య సేవలందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్‌ తెలపడంతో బాధితుల కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2022-05-27T06:04:46+05:30 IST