కుషాయిగూడలో దారుణ హత్య.. అసలేం జరిగింది!?
ABN , First Publish Date - 2021-05-15T13:33:50+05:30 IST
శ్రీకాంత్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి
- చెరువులో శవమై తేలి..
- ఆర్థిక లావాదేవీలే కారణం
- పోలీసుల అదుపులో నిందితులు..?
హైదరాబాద్/ఏఎస్రావునగర్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడలో కొట్టి చంపిన దుండగులు నాగారం అన్నారం చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం. కకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆముదాలపాటి రామ్మూర్తి(61) బిల్డింగ్ కాంట్రాక్టర్. ఈనెల 10న ఉదయం కుషాయిగూడలో శ్రీకాంత్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్నేహితుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి రామ్మూర్తి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. సాయంత్రం వరకు కూడా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు 11తేదీన రామ్మూర్తికి ఫోన్ చేయగా తాను అద్దంకిలో ఉన్నానని వస్తున్నానని తెలిపారు. ఇలా పలుమార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం చెప్పాడు. మరోసారి కుమారుడు, కుమార్తెకు ఫోన్ చేసి తనకు అత్యవసరంగా రూ.7లక్షలు కావాలని, ఎలాగైనా సర్దాలని చెప్పాడు. ఇలా చేస్తున్న క్రమంలో రెండోరోజు 12న రామ్మూర్తి ఫోన్ స్విచ్ ఆఫ్గా వచ్చింది. దీంతో మరింత ఆందోళనకు గురైన రామ్మూర్తి కుటుంబ సభ్యులు అదే రోజున కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు.
రామ్మూర్తి అదృశ్యంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 13వ తేదీ సాయంత్రం కీసర మండలం నాగారం అన్నారం చెరువులో ఓ వ్యక్తి శవం తేలియాడుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఆ మృతదేహం రామ్మూర్తిదిగా తేల్చారు. మృతదేహంపై కొట్టిన గాయాలు ఉండడంతో ఇది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో శ్రీకాంత్, శ్రీనివా్సరెడ్డిల పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. రామ్మూర్తిని కుషాయిగూడ గణే్షనగర్లోని ఓ తినుబండారం(మిక్సర్) కంపెనీ బట్టీల వద్ద హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా భావిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు రామ్మూర్తిని కుకట్పల్లి నుంచి కుషాయిగూడకు రప్పించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్, క్లూస్టీం, డాగ్స్క్వాడ్ బృందాలు సందర్శించారు.