వసతిగృహాలు తెరిచారు..సరుకులు ఇవ్వడం మరిచారు!
ABN , First Publish Date - 2020-11-29T04:30:58+05:30 IST
గురుకులాలు, కేజీబీవీలు తెరుచుకున్నా విద్యార్థుల భోజనానికి సంబంధించి సరుకుల సరఫరాపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించలేదు. కొవిడ్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఈ నె 23 నుంచి గురుకుల పాఠశాలలు తెరవాలని అధికారులు ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు
బొబ్బిలి, నవంబరు 28: గురుకులాలు, కేజీబీవీలు తెరుచుకున్నా విద్యార్థుల భోజనానికి సంబంధించి సరుకుల సరఫరాపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించలేదు. కొవిడ్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఈ నె 23 నుంచి గురుకుల పాఠశాలలు తెరవాలని అధికారులు ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు. భోజనానికి సంబంధించి సివిల్ సప్లయ్ గోదాముల నుంచి బియ్యం తెప్పించి చేతులు దులుపుకున్నారు. డీసీఎంఎస్కు ఇండెంట్ పెట్టుకున్నా పప్పు, నూనె, గోధుమ పిండి, శనగలు వంటివి ఇంతవరకూ సరఫరా చేయలేదు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు సంబంధించి వారం రోజులకు సరిపడా సరుకులు అందించారు. కేజీబీవీలకు సంబంధించి ఉదయం టిఫిన, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన కానీ భోజనం కానీ అందించాలి. కానీ మధ్యాహ్న భోజనంతో సరిపెడుతున్నారు. ఇలా ఒక్కో పాఠశాలకు ఒక్కో విధంగా సరుకుల పంపిణీ జరుగుతోంది. దీంతో విద్యార్థులను పిలిచేందుకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. డీసీఎంఎస్కు ఇండెంట్ పెట్టి రోజులు గడుస్తున్నా సరుకులు ఇంకా రాలేదని బొబ్బిలి గురుకుల ప్రిన్సిపాల్, గురుకులాల కన్వీనర్ కోడి రాంబాబు తెలిపారు. సరుకులు వచ్చిన వెంటనే విద్యార్థులకు కబుర్లు పెడతామని, వచ్చే నెల 1 నుంచి పూర్తి స్థాయి నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు.