కాపాడతారని ఇల్లు అప్పగిస్తే ఆక్రమించి.. బెదిరింపులు

ABN , First Publish Date - 2021-03-04T17:23:56+05:30 IST

ఇల్లు భద్రంగా చూసుకోమని అప్పగిస్తే దాన్ని ఆక్రమించారు.

కాపాడతారని ఇల్లు అప్పగిస్తే ఆక్రమించి.. బెదిరింపులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ఇల్లు భద్రంగా చూసుకోమని అప్పగిస్తే దాన్ని ఆక్రమించారు. ఖాళీ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. నగరానికి చెందిన ఎస్‌. నవనీత లక్ష్మి, ఆమె తల్లి కళావతి, అమ్మమ్మతో కలిసి రహ్మత్‌నగర్‌లో ఉంటోంది. 2013 మే 4న కార్మికనగర్‌లో ఈదమ్మ అనే మహిళ ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు కట్టేశారు. ఈదమ్మ అమ్మిన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. నవనీతలక్ష్మి ఫిర్యాదు మేరకు 2020లో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈదమ్మపై కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా తాను ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటుండంతో నవనీత ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఎవరూ కబ్జా చేయకుండా పది రోజుల పాటు ఇంటి సంరక్షణ బాధ్యతను అబ్రహంకు అప్పగించింది. అబ్రహం తనకు తెలిసిన గిరితో పాటు మరో పది మందిని అందులో ఉంచి, కాపలా ఉన్నందుకు గాను రోజుకు రూ.20 వేలు ఇచ్చేలా  నవనీతతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


పది రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని ఆమె చెప్పగా, ఇంకా ఆక్రమణ ప్రమాదం పొంచి ఉందని చెప్పాడు. మరో 30 రోజులు అందులో తన మనుషులను ఉంచేందుకు గాను రూ.7 లక్షలు, సరుకులను నవనీత నుంచి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కబ్జాదారులతో ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తానని అబ్రహం మరో పది లక్షలు తీసుకున్నాడు. మొత్తం డబ్బు తీసుకున్నాక ఇల్లు ఖాళీ చేయాలంటే అదనంగా పది లక్షలు కావాలని అబ్రహం, గిరి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. ఈ నెల 2న నవనీతఇంటికి వస్తే రాకుండా అడ్డంకులు సృష్టించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-04T17:23:56+05:30 IST