ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-07-25T05:45:00+05:30 IST
ప్రతి గ్రామంలో పేదలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
తిమ్మాపూర్, జూలై24 : ప్రతి గ్రామంలో పేదలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామంలో సర్వే నెంబర్ 557లో గల 97 ఎకరాల ప్రభుత్వ భూమిని సీపీఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ 2008 డిసెంబర్ 29న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి రామకృష్ణకాలనీలో శంకుస్థాపన చేసిన రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణ స్థలం నిరుపయోగంగా మారిందన్నారు. ఈ స్ధలంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని నిరుపేదలను ఏకం చేసి కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. రాజీవ్ స్వగృహ స్ధలంలో ఎర్ర జెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి మరిచిపోయా యన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టిగా వర్షం కురిసిందని సముద్రాలను తలపించే విధంగా అనేక కాలనీలు నీట మునిగాయని అన్నారు. భైంసా, నిర్మల్, అసిఫాబాద్ ఏరియాల్లో వర్షం కారణంగా రోడ్డు, బ్రిడ్జిలు తెగిపో యాయని, రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసిఆర్కు లేఖ కూడా రాస్తున్నమని చాడ వెంకట రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, జె.వి. రమణారెడ్డి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.