గృహనిర్మాణ పనులు నాణ్యతగా చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T06:20:48+05:30 IST

జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు నాణ్యతగా చేయాలని హౌసింగ్‌ జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

గృహనిర్మాణ పనులు నాణ్యతగా చేయాలి
ఊరందూరులో లేఅవుట్‌ను పరిశీలిస్తున్న జేసీ వెంకటేశ్వర్లు

శ్రీకాళహస్తి, జూలై 23: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హౌసింగ్‌ జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ఆయన శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రేణిగుంట మండలం అడుసుపాళెం, ఏర్పేడు మండలం వికృతమాల, కోదాడ, సరస్వతీకండ్రిగ, తొట్టంబేడు మండలం బీడీకాలనీ, శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పలు లే-అవుట్లలో సంతృప్తికరంగా గృహనిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కొన్నింటిలో ఆశించినంత మేర పనులు జరగడం లేదనీ, ఆగస్టు చివరి నాటికి అధికారులు నిర్దేశిత పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలని గుర్తుచేశారు. తొట్టంబేడు మండలం బీడీకాలనీలో ఇటుకల తయారీ కేంద్రాన్ని పరిశీలించి నాణ్యత, ఽధరపై నిర్వాహకులను ఆరా తీశారు. హౌసింగ్‌ డీఈ పీవీఎ్‌సశర్మ, తహసీల్దార్లు జరీనాబేగం, పరమేశ్వరస్వామి, ఎంపీడీవో బాలాజీ నాయక్‌, పురపాలక సంఘం ఇన్‌చార్జి కమిషనరు వెంకట్రమణ, ఏఈ అలీ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:20:48+05:30 IST