కాలువలు ఇలా.. నీరు పారేదెలా?

ABN , First Publish Date - 2022-08-20T05:24:32+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని కేసీ పంట కాలువలు శిథిలా వస్థకు చేరుకున్నాయి.

కాలువలు ఇలా.. నీరు పారేదెలా?
ముళ్ల కంపలతో నిండిపోయిన కేసీ పంట కాలువ

దెబ్బతిన్న పంట కాలువలు
చివరి ఆయకట్టు రైతులకు తప్పని కష్టాలు
పట్టించుకోని అధికారులు


చాగలమర్రి, ఆగస్టు 19: చాగలమర్రి గ్రామంలోని కేసీ పంట కాలువలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. ప్రధాన కాలువ నుంచి చివరి ఆయకట్టుకు నీరందించే పంట కాలువ లు దెబ్బతిన్నాయి. కాలువల్లో ముళ్ల కంపలు, పూడిక పెరిగింది. లైనింగ్‌ దెబ్బతిన్నది. కాలు వల మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. గత ఏడాది నామమాత్రంగా రూ.లక్షలు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. 1,000 ఎకరాలకు పైగా సాగు నీరు అందించాల్సి ఉండగా.. 300 ఎకరాలకు కూడా   అందడం లేదని రైతులు వాపోతు న్నారు. కాలువలు ఇలా ఉంటే నీరు ఎలా పారుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 50 రోజులు గడిచినా అధికారులు మాత్రం మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. కాలువలు మరమ్మతులు చేయక పోతే ఈ ఏడాది కూడా వరి సాగు ప్రశ్నార్థకమే. మరో రెండు రోజుల్లో కేసీ కాలువకు నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటిం చారు. ఇప్పటికీ మరమ్మతులు చేప ట్టకపోతే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా  అధికారులు స్పందించి పంట కాలువ మరమ్మతు పనులు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

 అధ్వానం

కేసీ పంట కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ముళ్ల కంపలు, పూడిక తొలగించాలి. కాలువలు సరిగా లేక చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. గ్రామంలోని మురికి నీరు పొలాల వెంట ప్రవహిస్తోంది. దీంతో  పంట దెబ్బతింటోంది.

 -శివుడు, రైతు

పట్టించుకోవడం లేదు

వరి పంట సాగు చేసేందుకు ఇబ్బందిగా ఉంది. ప్రతి ఏటా పంట నష్టపోతున్నాం. 4 ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నా. ప్రధాన కాలువలో నీరు ఉన్నా సాగుకు అందడం లేదు.  దీని వల్ల నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నాం.

-మాబాషా, రైతు

ప్రతిపాదనలు పంపించాం

కేసీ పంట కాలువలు, అక్విడెక్ట్‌ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే తక్షణమే పంట కాలువల పనులు చేపడతాం.

-జమాల్‌వలి, ఏఈ, కేసీ కెనాల్‌

Updated Date - 2022-08-20T05:24:32+05:30 IST