ఆ పోస్టు బీసీలకు ఎలా ఇస్తావ్?
ABN , First Publish Date - 2022-06-28T04:52:50+05:30 IST
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి పాత్రికేయులపైన మండిపడ్డారు.
ఎమ్మెల్యేను నిలదీసిన దళిత యువకుడు
మీడియాపై సాయిప్రసాద్రెడ్డి ఆగ్రహం
ఆదోని రూరల్, జూన్ 27 : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి పాత్రికేయులపైన మండిపడ్డారు. సోమవారం ఆదోని మండలం జాలిమంచిలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇందులో దళిత యువకుడు ఉప్పరహాళ్ నారాయణ మాట్లాడుతూ... ప్రభుత్వ రిజర్వేషన్ ప్రకారం వలంటీర్ నోటిఫికేషన్లో ఎస్టీ పోస్టు ఉండగా, బీసీలకు ఎలా ఇస్తారు...? ఎస్టీ అభ్యర్థులు లేకపోతే ఎస్సీలకు ఇవ్వాలి.... లేదా ఆ పోస్టును అలానే వదిలేయాలి... అలా కాకుండా బీసీ వ్యక్తికి వలంటీర్ పోస్టు ఇవ్వడం సరి కాదని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఆవేశపడిపోయాడు. అయినా ఆ యువకుడు ‘తమ గ్రామంలో ఎస్టీలు లేరని, ఆ వలంటీర్ పోస్టు ఎస్సీలకు కేటాయించాలని ఆరు నెలలుగా అడుగుతోంటే బీసీలకు ఎలా ఇస్తార’ని మరోసారి ప్రశ్నించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న పాత్రికేయులపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో నీ అంతు చూస్తా.. రేపటి నుంచి నా కార్యక్రమానికి ఎలా వస్తావో చూస్తా.... అని ఓ పాత్రికేయుడు చేతిలో ఉన్న సెల్ఫోన్ను లాక్కొన్నారు. దీంతో అధికారులు, ప్రజలు, పోలీసులు బిత్తరపోయారు. అట్లాగే ‘ఏం తమాషాగా ఉందా.... ఇంతకు నీవు డ్యూటీకి వస్తున్నావా... ఏంటి నీ కత అంటూ పంచాయతీ కార్యదర్శి ఓంప్రకా్షపై ఎమ్మెల్యే చిందులు వేశారు. ఎమ్మెల్యే పర్యటనలో ఈడిగ ఈరమ్మ అనే మహిళ.. కూలీకి పోతేగాని కడుపు నిండని నాకు కారు ఉందని సంక్షేమ పథకాలు రద్దు చేశారని సాయిప్రసాద్రెడ్డిని నిలదీశారు. ఈమెకు ఇంటి పట్టా ఇవ్వడానికి రాసుకోండని అధికారులకు చెప్పి మెల్లగా ఎమ్మెల్యే జారుకున్నారు.