కోర్టులో కేసు ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు?
ABN , First Publish Date - 2022-05-18T04:32:01+05:30 IST
భూవివాదంపై కోర్టులో కేసు ఉండగా రిజిస్ర్టేషన్ చేయడం సరైంది కాదని ఓ బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం అమరచింత తహసీల్దార్ సింధూజను నిలదీసిన సంఘటన జరిగింది.
- తహసీల్దార్ను నిలదీసిన బాధితురాలు
- కార్యాలయం ముందు రోదన
అమరచింత, మే 17: భూవివాదంపై కోర్టులో కేసు ఉండగా రిజిస్ర్టేషన్ చేయడం సరైంది కాదని ఓ బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం అమరచింత తహసీల్దార్ సింధూజను నిలదీసిన సంఘటన జరిగింది. తమకు న్యాయం చేయాలని, తహసీల్దార్కు లంచమిచ్చానని కార్యాలయం ముందు బాధితురాలు ఆరోపిస్తు ఆవేదన చెందింది. బాధితురాలి వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్తగౌని లక్ష్మారెడ్డి, వెంకటమ్మలకు నలుగురు కుమారులున్నారని, లక్ష్మారెడ్డి పేరిట ఉన్న నాలుగు ఎకరాల 28 గుంటలు సర్వే నంబర్ 607/అలో భూమి ఉన్నదని తెలిపింది. తాతల స్థిరాస్థిలో తన పిల్లలకు హక్కు ఉందని కేజీ పుష్పమ్మ కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. గత ఏడాది నుంచి కేసు కోర్టులో నడుస్తుండగానే అమరచింత తహసీల్దార్ మాకు తెలియకుండా తమ మామ పెద్ద కుమారుని యొక్క కుమారుడు కొత్తగౌని శ్రీనివాస్రెడ్డి పేరిట ధరణిలో భూరిజిస్ర్టేషన్ చేశారని తెలిపింది. తమ దగ్గర లంచం తీసుకుని మాకు కాకుండా రిజిస్ర్టేషన్ చేయడం సరైంది కాదని తహసీల్దార్ను నిలదీస్తు ఆమె కార్యాలయం ముందు ఆరోపించింది. ఈ విషయమై తహసీల్దార్ సింధూజను వివరణ కోరగా, భూపట్టాదారుడు స్లాట్ బుక్ చేసుకొని ఉన్నాడని, ఆ పట్టాదారుని ఒప్పంద ప్రకారం మనుమని పేరిట భూరిజిస్ర్టేషన్ చేసినట్లు తెలిపారు. లంచం తీసుకున్నానని ఆమె ఆరోపణ పచ్చి అబద్దమని తహసీల్దార్ ఖండించారు.