ఖనిజ నిధి నుంచి ఎంత ఖర్చు చేశారు?
ABN , First Publish Date - 2020-09-22T08:14:09+05:30 IST
కృష్ణాజిల్లాలో ఖనిజ నిధిని ఎంత మేరకు ఖర్చు చేశారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్ల మెంటులో సోమవారం ప్రశ్నించారు.
పార్లమెంటులో ఎంపీ వల్లభనేని బాలశౌరి
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో ఖనిజ నిధిని ఎంత మేరకు ఖర్చు చేశారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్ల మెంటులో సోమవారం ప్రశ్నించారు. కేంద్ర బొగ్గ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 2016 మార్చి నుంచి కృష్ణాజిల్లాలో ఖనిజ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 116.57కోట్లను వసూలు చేశామని, అందులో 860 ప్రాజెక్టులకు గాను రూ.79.13 కోట్లను మంజూరు చేసి రూ. 31.49 కోట్లను ఖర్చుచేశామని తెలిపారు.
ఈ నిధుల వినియోగంలో పారదర్శకత కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఖనిజనిధి సభ్యులుగా చేర్చినట్లు తెలిపారు. ఈ నిధి నుంచి 30శాతం నిధులను కొవిడ్ నియంత్రణలో భాగంగా వైద్యఖర్చుల కింద వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.