ఆస్తులను కూల్చి అవమానించడమేంటి?
ABN , First Publish Date - 2022-01-22T05:00:14+05:30 IST
ఆస్తులను కూల్చి అవమానించడమేంటి?
- నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా?
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు
షాద్నగర్ అర్బన్, జనవరి 21: పేదల సంక్షేమం, ఆలయాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తున్న దాతల ఆస్తులను అనుమతుల్లేవంటూ కూల్చివేస్తూ అవమానించడమేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షాద్నగర్లో హెచ్ఎండీ అధికారులు అనుమతులు లేవంటూ శుక్రవారం పలు భవనాలను కూల్చివేశారు. ఈశ్వర్కాలనీలోని అభ్యాస్ పాఠశాల భవనం ఎదుట కూల్చివేతలు చేపట్టారు. ఆ స్థలాన్ని బక్కని నర్సింహులు పరిశీలించి మాట్లాడారు. అభ్యాస్ పాఠశాల యాజమాని ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లక్షలాది రూపాయలను ఖర్చుచేస్తున్నారని తెలిపారు. పాఠశాల కోసం నిర్మించి ఇచ్చిన భవనానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదన్నారు. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ ఆదేశాలు అంటూ వస్తున్న అధికారులు నిర్మాణ సమయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిర్మాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ తరువాత ఆస్తిపన్ను తీసుకొని ఇంటి నెంబర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు కూల్చివేయడం సరికాదన్నారు. యజమాని వచ్చి అనుమతి పత్రాలను చూపే వరకైనా ఆగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేయాలే తప్ప, వారి ఆస్తులను ధ్వంసం చేయడం కోసం కాదన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా ప్రారంభంలోనే అడ్డుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ కింద రెగ్యూలరైజ్డ్ చేయాలే తప్ప, కూల్చివేయడం సరికాదన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తానని ఈ సందర్భంగా బక్కని నర్సింహులు పేర్కొన్నారు.