సాగునీటి కష్టాలు తీరేదెలా?
ABN , First Publish Date - 2022-06-28T05:45:17+05:30 IST
సాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. తూములు, గేట్లు దెబ్బతిన్నా, సాగునీటి కాలువలు పూడుకుపోయినా అధికారుల్లో చలనం లేదు.
పూడుకుపోయిన కాలువ
దెబ్బతిన్న తూములు, గేట్లు
చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం
ఖరీఫ్లో పంటలకు నీరందదని రైతుల ఆవేదన
ఎలమంచిలి, జూన్ 27: సాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. తూములు, గేట్లు దెబ్బతిన్నా, సాగునీటి కాలువలు పూడుకుపోయినా అధికారుల్లో చలనం లేదు. ఈ ఖరీఫ్లోనైనా పంటలకు నీరందుతుందని ఆశపడిన ఆయకట్టు రైతులకు నిరాశే మిగిలింది.
కశింకోట మండలంలోని నరసాపురం ఆనకట్ట నుంచి ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లోని సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. ఈ ఆనకట్ట నుంచి ఎలమంచిలి పట్టణంతో పాటు జంపపాలెం, తురంగలపాలెం, రామారాయుడుపాలెం, సోమలింగపాలెం, కట్టుపాలెం, కొత్తపాలెం ఆయకట్టు భూములకు సాగునీరు అందించే కాలువ తుప్పలతో పూడుకుపోయింది. ఈ కాలువలో పూడిక తీయాలని, లేకుంటే ఖరీఫ్ సీజన్లో ఇబ్బందులు తప్పేలా లేవని కొన్ని నెలలుగా అధికారులను ఆయకట్టురైతులు కోరుతున్నారు. ఈ కాలువలో పూడిక తీయాలని రామారాయుడుపాలెం, కొత్తపాలెం వార్డుల ప్రజాప్రతినిధులు గత మునిసిపల్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. అయినా ఈ కాలువలో పూడికలు తీయలేదు. అలాగే దెబ్బతిన్న తూములు, గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సాగునీరు పుష్కలంగా అందుతుందా? లేదా? అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. ఈ ఏడాది పంటలు వేయాలా? లేదా? అనే ఆలోచనలో ఉన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి వేసవిలోనే కాలువలో పూడిక తీయించి ఉంటే ఖరీఫ్ వ్యవసాయ పనులు ధీమాగా చేపట్టేవారమని రైతులు చెబుతున్నారు. కాగా సాగునీటి కాలువలో పట్టణంలోని డ్రైనేజీల నీరు కలిసిపోతుండడంతో సాగునీరు కలుషితమవుతోందని రైతులు వాపోతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం
-శివరామకృష్ణ, నీటిపారుదలశాఖ ఏఈ
ఈ సాగునీటి కాలువ ఆధునికీకరణ పనులకు సుమారు రూ.95 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. ఈ కాలువ గ్రామాల పరిధిలో ఉన్న చోట ఉపాధి హామీ పనులు చేపడతాం.
కాలువలో పూడిక తీయించాలి
-గొర్లె నూకరాజు, కౌలు రైతు, ఎలమంచిలి
నరసాపురం ఆనకట్ట నుంచి వచ్చే సాగునీటి కాలువ తుప్పలతో మూసుకుపోయింది. కాలువలో పూడికలు తీయకపోవడం వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు స్పందించి కాలువలో పూడిక తీయించాలి.