ఎల్ఎండీకి భారీ ఇన్ఫ్లో
ABN , First Publish Date - 2020-09-22T06:01:44+05:30 IST
ఎగువన కురిసిన వర్షాలతో దిగువ మానేరు జలశాయంలోకి వరద నీరు పోటెత్తింది. మోయతుమ్మెద వాగు, ఎస్సారార్
ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద
సాయంత్రానికి తగ్గుముఖం
దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల
తిమ్మాపూర్, సెప్టెంబరు 21: ఎగువన కురిసిన వర్షాలతో దిగువ మానేరు జలశాయంలోకి వరద నీరు పోటెత్తింది. మోయతుమ్మెద వాగు, ఎస్సారార్ జలాశయం నుంచి ఆదివారం రాత్రి దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఎల్ఎండీ 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తక్కువ వ్యవధిలో ఇంత మొత్తంలో నీరు రావడం ఎల్ఎండీ చరిత్రలో అరుదు అని జీవీసీ-4 ఎస్ఈ శివకుమార్ తెలిపారు. తెల్లవారు జాము నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో క్రమేపి గేట్లను అవసరం మేర తెరచి మిగిలినవి మూసివేశారు. ఎల్ఎండీ పూర్తి స్ధాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం వరకు 23.344 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మోయతుమ్మెద వాగు నుంచి 24,000క్యూసెక్కులు, ఎస్సారార్ రిజర్వాయర్ నుంచి 2,500 క్యూసెక్కులు, మొత్తం 27,229 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఎనిమిది గేట్ల ద్వారా 24,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ నుంచి 2,500 క్యూసెక్కులు, మొత్తం దిగువకు 27,229 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు జీవీసీ-4 ఎస్ఈ శివ కుమార్ తెలిపారు.
ఎస్సారార్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో
బోయినపల్లి: శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. 9,126 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు ప్రాజెక్ట్ నీటి నిల్వ 25 టీఎంసీలకు పైగా ఉండడంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో సోమవారం సాయంత్రం నాటిని ప్రాజెక్ట్ నీటి నిలువ 24.966 టీఎంసీలకు చేరుకోవడంతో ఔట్ఫ్లోను తగ్గించారు. ప్రాజెక్ట్ నుంచి కేవలం 2,836 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.