విపక్షాల్లో భారీ చీలిక!
ABN , First Publish Date - 2022-06-25T08:38:59+05:30 IST
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బీజేపీ ఖరారు చేయడం ప్రతిపక్షాలను ఆం దోళనకు గురిచేస్తోంది.
గిరిజన ‘రాష్ట్రపతి’ తెచ్చిన తంటా!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బీజేపీ ఖరారు చేయడం ప్రతిపక్షాలను ఆం దోళనకు గురిచేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను విపక్షాలు ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కానీ బీజేపీ ద్రౌపదిని తెరపైకి తేవడంతో తమ ప్రజాప్రతినిధుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉంద ని ఆ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ముర్ము అభ్యర్థిత్వం పై ప్రధాని చరించగానే ఒడిసా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బేషరతు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ పార్టీ, యూపీఏ భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సైతం డైలమాలో పడింది. ద్రౌపదిలాగే ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్ సోరెన్ సం తాలీ గిరిజన తెగకు చెందినవారు. పైగా ఆమె ఆరేళ్లకుపైగా జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. జేఎంఎం ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఎస్టీలే. పార్టీ ఆమెకు మద్దతివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందుతుందన్నది హేమంత్ భయం. 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గద్దెనెక్కిన ఛత్తీ్సగఢ్ జనాభాలో 30ు మంది ఎస్టీలే. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరులో ఎన్నికలు ఉన్నాయి. తమ ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపదికి ఓటేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం ఆందోళనగా ఉంది. మధ్యప్రదేశ్లోనూ గిరిజనులు 21ు ఉన్నారు. ప్రస్తు తం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ద్రౌపదికి మద్దతివ్వకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన బెల్టులో ఆధిక్యం సాధిస్తుందని ఆందోళన చెందుతోంది. రాజస్థాన్లోనూ 13.5ు మంది గిరిజనులు ఉన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోనూ గిరిజన జనాభా 14ు. నవంబరు-డిసెంబరుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించాలని ప్రధాని భావిస్తున్నారు. మొత్తమ్మీద ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దరిదాపుగా రాజకీయ పార్టీలన్నీ గిరిజనులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - సెంట్రల్ డెస్క్
ఆ రాత్రి 9 గంటల వరకు వెంకయ్య పేరే!
రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును 21వ తేదీ రాత్రి జేపీ నడ్డా ప్రకటించారు. నిజానికి ఆ రోజు 5 పేర్లపై బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. మొదట ఉన్నది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరే. ఛత్తీ్సగఢ్ గవర్నర్ అనసూయ ఉయికే, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్-పుదుచ్చేరి గవర్నర్ జనరల్ తమిళిసై సౌందరరాజన్లపైనా చర్చించారు. ఆ రాత్రి 9 గంటల వరకు వెంకయ్య పేరే ప్రచారంలో ఉంది. అయితే చివరి క్షణంలో ఆకస్మికంగా ద్రౌపది పేరు ప్రకటించడం బీజేపీ వర్గాలనూ ఆశ్చర్యపరిచింది. ద్రౌపదికి అవకాశమిస్తే ఒడిసా, జార్ఖండ్, ఛత్తీ్సగఢ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని అగ్రనేతలు అంచనా వేశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని మోదీ, రాజ్నాథ్లకు యశ్వంత్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు.