Student Funeral: వందలాది మంది కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2022-07-23T22:58:24+05:30 IST
తమిళనాడులోని కాళ్లకురుచి స్కూలులో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన 12వ తరగతి విద్యార్థిని అంత్యక్రియులు ..
చెన్నై: తమిళనాడులోని కాళ్లకురుచి స్కూలులో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన 12వ తరగతి విద్యార్థిని అంత్యక్రియులు ఆదివారంనాడు పూర్తయ్యాయి. భారీ భద్రత మధ్య జరిగిన ఈ అంత్యక్రియలకు వందలాది మంది హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. కనిమయూర్ శక్తి మెట్రిక్యులేషన్ స్కూలు హోస్టల్లో గతవారం 17 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం కనిపించడం తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనకు కారణమైన స్కూలు యాజమాన్యంపైన, నిందితుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న నిరసనలు వెల్లువెత్తడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
కాగా, తమ కుమార్తె మృతి వెనుక బలమైన కారణాలున్నాయని ఆరోపిస్తూ బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. రెండో పోస్ట్మార్టం కోసం వారు డిమాండ్ చేశారు. దీంతో రీ-అటోప్సీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అది పూర్తికావడంతో ఆమె మృతదేహాన్ని పోలీసు కస్టడీ నుంచి తీసుకువెళ్లాలని బాలిక కుంటుబ సభ్యులను శుక్రవారం ఆదేశించింది.
మరోవైపు, మొదటి రిపోర్ట్లో తేలిన విషయాలే రెండో రిపోర్ట్లో తేలడంతో బాలిక తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేశారని, రీ-పోస్ట్ మార్టం ప్రొసీజర్కు తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు. బాలిక ఆత్మహత్య చేసుకుందని స్కూలు యాజమాన్యం చెప్పినప్పటికీ బాలిక గదిలో ఒక సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కూలులోని ఇద్దరు టీచర్లు తనను వేధించారని ఆ లేఖలో బాలిక పేర్కొనడంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.