పెళ్లైన ఆరు నెలలకు వధూవరులు మాయం.. పోలీసులు కేసుని ఎలా ఛేదించారంటే?..

ABN , First Publish Date - 2022-01-12T08:14:27+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా ఇద్దరూ మాయమయ్యారు. ఆ భార్యాభర్తలు కనిపించడంలేదని యువకుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి...

పెళ్లైన ఆరు నెలలకు వధూవరులు మాయం.. పోలీసులు కేసుని ఎలా ఛేదించారంటే?..

వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా ఇద్దరూ మాయమయ్యారు. ఆ భార్యాభర్తలు కనిపించడంలేదని యువకుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిల్‌భిత్ జిల్లా పరేవా గ్రామానికి చెందిన రమేష్(28) ఢిల్లీలోని ఒక బేకరిలో పనిచేసేవాడు. అక్కడ అతనికి నైనా(27) అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంటి వద్ద తల్లి ఒంటరిగా ఉందని చెప్పి రమేష్ భార్యతో సహా గ్రామానికి వచ్చేసాడు. 


రమేష్ తల్లితో నైనాకి పడకపోవడంతో భార్యాభర్తలిద్దరూ పక్కనే ఇల్లు తీసుకొని ఉండేవారు. ఇలా పెళ్లైన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు అనుకోకుండా ఇంటికి తాళం వేసి ఉంది. రమేష్, నైనా ఇద్దరూ కనపడకుండా పోయారు. దీంతో రమేష్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు గొడవపడేవారని గ్రామస్తులు చెప్పారు. దీంతో పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేశారు. రమేష్ తల్లి కూడా తన కొడుకు, కోడలి మధ్య గొడవ జరిగేవని ధృవీకరించింది. రమేష్ తన భార్యను హత్య చేసి పారిపోయాడేమోనని అనుమానంతో పోలీసులు ఇంటి తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు శవం కోసం వెతికారు. ఎక్కడా ఏమీ కనపడలేదు. చివరికి గ్రామస్తులు రమేష్‌కు ఒక పొలం ఉందని చెప్పడంతో.. పోలీసులు పొలమంతా పరిశీలించారు. 


పోలీసులకు పొలంలో ఒక ప్రదేశంలో ఏదో గోతిని కప్పేసినట్టుగా ఉన్నట్లు కనిపించింది. అక్కడ తవ్వి చూస్తే నైనా శవం కనిపించింది. నైనా మృతదేహానికి పరీక్ష చేయగా.. ఆమె తలకు ఏదో బలమైన వస్తువు కొట్టడంతో నైనా చనిపోయిందని తేలింది. రమేష్, నైనా చివరగా కనిపించిన రోజు ఇద్దరూ బాగా తగువులాడారని.. ఆ క్రమంలో రమేష్ రోకలి బండతో భార్య తలపై కొట్టాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 


నైనా హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2022-01-12T08:14:27+05:30 IST