తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి అసభ్యకర సందేశాలు పంపుతున్నారంటూ మహిళ ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ విషయం!
ABN , First Publish Date - 2022-03-05T19:45:52+05:30 IST
తన ఫేస్బుక్ అకౌంట్లో అసభ్యకర సందేశాలు, ఫొటోలు పోస్ట్ అయినట్టు తెలుసుకున్న మహిళ షాకైంది..
తన ఫేస్బుక్ అకౌంట్లో అసభ్యకర సందేశాలు, ఫొటోలు పోస్ట్ అయినట్టు తెలుసుకున్న మహిళ షాకైంది.. ఎవరో తన అకౌంట్ను హ్యాక్ చేశారని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు షాకింగ్ విషయం బయటపెట్టారు.. ఆ మహిళ పరువు తీసేందుకు ఆమె భర్తే ఆ పోస్టింగ్లు చేసినట్టు వెల్లడించారు.. ఆ మహిళ కొద్ది రోజులుగా తన భర్తకు దూరంగా ఉంటోంది.. దీంతో అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి. అయితే అతనికి తన భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె సంతోష్ను వదిలేసి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఫేస్బుక్ ఐడీ, పాస్వర్డ్ తెలుసుకున్న సంతోష్ ఆమె అకౌంట్ నుంచి అసభ్యకర పోస్ట్లు చేయడం ప్రారంభించాడు. సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గూగుల్ సిబ్బంది సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బాధితురాలి భర్తే ఆ పోస్ట్లు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, సంతోష్పై అతని భార్య ఏడాది క్రితం కట్నం వేధింపుల కేసు నమోదు చేసింది. అది మనసులో పెట్టుకుని ఆమె పరువు తీసేందుకు తాను ఇలా చేసినట్టు పోలీసుల ఎదుట సంతోష్ అంగీకరించాడు.