అనుమానంతో భార్యను కడతేర్చి.. పురుగు మందు తాగిన భర్త..
ABN , First Publish Date - 2020-10-29T15:32:01+05:30 IST
నుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్త ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని కట్టావారిపాలెంలో జరిగింది.
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి రూరల్ (గుంటూరు): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్త ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని కట్టావారిపాలెంలో జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు పిడుగురాళ్ళ మండలం జూలకల్లు గ్రామానికి చెందిన గాయత్రి (20)ని సత్తెనపల్లి మండలం కట్టావారిపాలేనికి చెందిన మేళంగి ఫిలిప్తో వివాహం జరిపించారు. పెళ్లయిన దగ్గరి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న ఫిలిప్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి కూడా భార్యతో గొడవపడి ఆమెను ఇంట్లోనే గొంతునులిమి చంపేశాడు. అనంతరం అతను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబ సభ్యులు ఫిలిప్ను చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారు. ఇరుగుపొరుగు ద్వారా సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. తన కుమార్తెను అల్లుడు ఫిలిప్, అత్త తిరుపతమ్మలు కలిసి హత్యచేశారని మృతురాలి తల్లి చింతల సువార్తమ్మ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఆ మేరకు తల్లీ, కొడుకులపై హత్యానేరం కేసు నమోదుచేసినట్లు ఇన్చార్జి రూరల్ ఎస్ఐ ఎం.నజీర్బేగ్ బుధవారం తెలిపారు.