చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి మాయం.. రెండేళ్ల తర్వాత సడన్గా కనిపించిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-05-17T21:35:24+05:30 IST
అతను ఓ స్కూల్ టీచర్.. అతనికి 22 ఏళ్ల కిందట వివాహం జరిగింది.. ఒక కొడుకు, కూతురు ఉన్నారు..
అతను ఓ స్కూల్ టీచర్.. అతనికి 22 ఏళ్ల కిందట వివాహం జరిగింది.. ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. అతను రెండేళ్ల క్రితం హఠాత్తుగా భార్య, పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.. తిరిగి సోమవారం ఉదయం కలెక్టరేట్లో కనిపించాడు.. రెండేళ్ల క్రితం మాయమై తిరిగి కనిపించిన భర్తను ఆ మహిళ వెనక నుంచి గట్టిగా పట్టుకుంది.. అతను వదిలించుకుందామన్నా వీల్లేకుండా ఉడుము పట్టు పట్టింది.. భర్తను పట్టుకునే అతడితో గొడవకు దిగింది.. చివరకు వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది.. బీహార్లోని వైశాలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
హాజీపూర్కు చెందిన అభయ్ కుమార్ సింగ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అతనికి భార్య మమత, 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కూతురు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఎవరికీ చెప్పా పెట్టకుండా అభయ్ ఇంటి నుంచి పరారయ్యాడు. భార్య, పిల్లలు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. కాగా, సోమవారం ఉదయం హాజీపూర్లోని ఓ న్యాయవాదిని కలిసేందుకు అభయ్ వచ్చాడు. ఆ విషయం మమత, ఆమె పిల్లలకు తెలిసింది. వెంటనే మమత అక్కడకు చేరుకుని భర్తను పట్టుకుంది. భర్త ఎటూ పారిపోకుండా అతడిని మమత వెనుక నుండి గట్టిగా పట్టుకుంది.
అభయ్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. పిల్లలిద్దరూ చెరో చెయ్యీ పట్టుకున్నారు. దీంతో అక్కుడున్న ఇతరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. రెండేళ్ల క్రితం ఏ కారణం లేకుండా భర్త.. తనను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడని, అప్పట్నుంచి చాలా కష్టాలు పడుతున్నామని మమత చెప్పింది. భార్య తన మేనమామ సూచనలు పాటిస్తూ తనను ఇబ్బందులు పెడుతోంది కాబట్టి ఆమెతో కలిసి ఉండనని అభయ్ చెప్పాడు. స్థానికులు ఈ గొడవ గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తలిద్దరినీ స్టేషన్కు తీసుకెళ్లారు.