బిడ్డ పుట్టిన రెండు రోజులకే మృతి చెందిన తల్లి.. మనస్తాపానికి గురై తండ్రి కూడా..

ABN , First Publish Date - 2020-07-14T16:12:38+05:30 IST

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి..

బిడ్డ పుట్టిన రెండు రోజులకే మృతి చెందిన తల్లి.. మనస్తాపానికి గురై తండ్రి కూడా..

భార్య మృతితో భర్త ఆత్మహత్య

అనాథగా మారిన పసిబిడ్డ


సింహాచలం(విశాఖపట్టణం): పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి మృత్యుఒడికి చేరిన ఏడు రోజులకే తండ్రి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సింహగిరిపై చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జలుమూరి శ్రావణ్‌కుమార్‌(20), అంబిక (20) సింహగిరి గ్రామంలో ఉంటూ ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చి, తొమ్మిది నెలలు నిండాక ఫిట్స్‌ రావటంతో ఈనెల ఆరున కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ఆమె మగపిల్లాడికి జన్మనిచ్చింది. తర్వాత రెండురోజులకే అంటే ఈనెల 8న అంబిక అనారోగ్యంతో కన్నుమూసింది.


భార్య మరణంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గోపాలపట్నం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో చంటి పిల్లాడు అనాథగా మారాడని గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.


Updated Date - 2020-07-14T16:12:38+05:30 IST