భర్త ఇంటి ఎదుట ఆందోళన
ABN , First Publish Date - 2022-06-26T17:07:49+05:30 IST
ప్రేమించి మతాంతర వివాహం చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన వనస్థలిపురం
హైదరాబాద్/వనస్థలిపురం: ప్రేమించి మతాంతర వివాహం చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీలో కొన్నాళ్లుగా నివాసముంటున్న ఆర్.ప్రమీలారెడ్డి ఆలియాస్ దుర్గా(25) సాహెబ్నగర్కు చెందిన మహ్మద్ ఫారుఖ్ అలీతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఏడాదిన్నర కితం హిందూ సంప్రదాయం ప్రకారం నగరంలోని కొండాపూర్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే ఫారుఖ్ అలీకి పదేళ్ల కితమే వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం దుర్గాకు తె లిసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
పెళ్లి సమయంలో తన వద్ద రూ. 3లక్షల రూపాయలు, కొంత బంగారం తీసుకున్నాడని, ఇప్పుడు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అదే సమయంలో అక్కడ ఫారుఖ్ అలీ మొదటి భార్య షకీలా భాను, దుర్గల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేపట్టిన దుర్గాకు న్యాయం జరిగే విధంగా చూస్తామనడంతో ధర్నాను విరమించింది. అతని నుంచి తనకు రక్షణ కల్పించి, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.