ఒంగోలు వన్టౌన్లో వైసీపీ నేతల హల్చల్
ABN , First Publish Date - 2022-08-09T06:43:12+05:30 IST
ఒంగోలు వన్టౌన్ స్టేషన్లో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు బర్త్డే వేడుకలకు స్టేషన్ వేదికైంది.
సీఐ బర్త్డే వేడుకలకు వేదికైన పోలీసు స్టేషన్
ఒంగోలు క్రైం, ఆగస్టు 8 : ఒంగోలు వన్టౌన్ స్టేషన్లో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు బర్త్డే వేడుకలకు స్టేషన్ వేదికైంది. నగరంలోని కొందరు వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని హడావుడి చేశారు. సీఐకు బొకేలు, స్వీటు ప్యాకెట్లు ఇచ్చి అభినందించారు. సిబ్బంది, ఫిర్యాదుదారులు కూడా విసిగిపోయేలా సీఐ ఆనందంతో ఉప్పొంగిపోవడం కనిపించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు పోలీసు స్టేషన్లో ఉద్యోగులైనా, అధికారులైనా వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదు. ఎవరిదైనా జన్మదినమైతే అక్కడ పనిచేసేవారు సాధారణ రీతిలో శుభాకాంక్షలు చెప్పుకోవటం పరిపాటి. కానీ సీఐ జన్మదినం సందర్భంగా సోమవారం స్టేషన్లో పెద్ద హంగామా చేశారు. వన్టౌన్ సీఐగా వెంకటేశ్వర్లు కొంతకాలం క్రితం నియమితులయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో ఆయన ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. సోమవారం ఆయన బర్త్డే వేడుకలకు స్టేషన్నే వేదిక చేయడం విమర్శలకు తావిచ్చింది. కొందరు కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. 48వ డివిజన్ కార్పొరేటర్ భర్త వేమూరి మాల్యాద్రి ఈ వేడుకల నిర్వహణలో ప్రధానపాత్ర పోషించారు. సదరు సీఐ ఈ స్టేషన్కి రావడం వెనుక ఈయన కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం ఉంది. ఆయనతోపాటు ఇతర కార్పొరేటర్లు, వారి అనుచరులు, వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేగాక వేడుకల ఫొటోలను సోషల్ మీడియా ద్వారా వారే ప్రచారం చేసుకున్నారు. సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారులంతా ఉండే నగరంలోని ఓ స్టేషన్లో ఇలా జరగటాన్ని వారు సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం.