Huzurabad కౌంటింగ్.. మినిట్ టూ మినిట్ అప్డేట్స్
ABN , First Publish Date - 2021-11-02T13:14:36+05:30 IST
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నది.
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నది. హోరాహోరీ జరిగిన పోరులో నువ్వానేనా..? అన్నట్లు పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భవితవ్యం నేడు తేలిపోనున్నది. పోలింగ్ సందర్భంగా వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో ఒకటి మినహా అన్ని సంస్థలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించనున్నారని తేల్చిచెప్పాయి. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలన్నీ బీజేపీవైపే మొగ్గు చూపిస్తున్నా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కౌంటింగ్ ఇలా.. (7:40 AM)
మరికొన్ని నిమిషాల్లో (ఉదయం 8 గంటలకు) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. రెండు హాళ్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్కు కనీసం 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడవుతుంది.
భారీ బందోబస్తు.. (7:45 AM)
కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీలు-2, ఏసీపీలు-6, సీఐలు 14, ఎస్ఐలు 41, సిబ్బంది 500 మందితో పాటు కేంద్రబలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం ఎస్ఆర్ఆర్ కళాశాల పరిసరాలు మొత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు.. కొవిడ్ టీకా రెండు డోసులు పూర్తయిన వారినే కౌంటింగ్ సిబ్బందిగా తీసుకున్నారు. ర్యాపిడ్ టెస్టు కూడా నిర్వహించారు. రెండు డోసులు తీసుకున్న వారికే పార్టీల కౌంటింగ్ ఏజెంట్ పాసులు జారీ చేశారు. విధిగా మాస్కు ధరించి రావాలని అధికారులు ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం (8:16 AM)
హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ జరుగనుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికానుంది. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే.
తొలి రౌండ్
టీఆర్ఎస్- 4444
బీజేపీ- 4610
కాంగ్రెస్- 119
బీజేపీ లీడ్- 166