Hyd: వ్యాక్సిన్ను..నిరాకరించిన 18 వేల మంది..సహకరించని 15 వేల మంది
ABN , First Publish Date - 2021-09-17T17:52:31+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు గ్రేటర్లోని పలువురు నిరాకరించారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదని
హైదరాబాద్ సిటీ: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు గ్రేటర్లోని పలువురు నిరాకరించారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదని జీహెచ్ఎంసీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్లో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, పలు బస్తీ దవాఖానాలతోపాటు మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. దాదాపు 20 రోజులపాటు జరిగిన కార్యక్రమంలో భాగంగా 4846 కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినట్టు అధికారులు చెబుతున్నారు. నిత్యం 30 నుంచి 40 వేల మందికి టీకా ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన వారిలో మెజార్టీ టీకా తీసుకున్నారని పేర్కొంటున్నారు. 31,611 ఇళ్లకు తాళం వేసి ఉండడంతో వ్యాక్సిన్ వేయలేదని నివేదికలో పేర్కొన్నారు. 18,937 మంది టీకా తీసుకునేందుకు నిరాకరించారని, 15,114 మంది వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అన్న విషయం చెప్పలేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మరోసారి వారి ఇళ్లకు వెళ్లి టీకా తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.