అనుకున్నవి 14 అయినవి 8
ABN , First Publish Date - 2021-11-07T17:42:25+05:30 IST
మహానగరంలో పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ఉద్దేశించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.34 కోట్లతో ఐదేళ్ల క్రితం దశల వారీగా 14 చోట్ల నిర్మాణ
ఐదేళ్లు గడిచినా నిర్మాణంలో తీవ్ర జాప్యం
హైదరాబాద్ సిటీ: మహానగరంలో పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ఉద్దేశించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.34 కోట్లతో ఐదేళ్ల క్రితం దశల వారీగా 14 చోట్ల నిర్మాణ పనులు చేపట్టగా.. ఇప్పటి వరకు కేవలం ఎనిమిది మాత్రమే పూర్తయ్యాయి. మరో ఆరుచోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే ఫంక్షన్ హాళ్ల నిర్మాణం విషయంలో ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు, కాలనీల్లో పుట్టిన రోజు, పెళ్లి, ఇతరత్రా వేడుకలు జరుపుకునేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారికి నామమాత్రపు ధరకు ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉండేలా.. మల్టీపర్పస్ హాళ్లను నిర్మిస్తున్నారు. రెండు చోట్ల పనులు తుది దశలో ఉండగా.. మరో నాలుగు ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.
పూర్తయిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు..
బన్సీలాల్పేట ఫ బోయిగూడ ఫ నెహ్రూనగర్ (మారేడ్పల్లి) ఫ చైతన్యనగర్ (పటాన్చెరు) ఫ సీతాఫల్మండి టీఆర్టీ క్వార్టర్స్ ఫ గాంధీ విగ్రహం (ఎల్బీనగర్) ఫ గాంధీనగర్ ఫేజ్-4 (రామంతాపూర్) ఫ కేపీహెచ్బీ కాలనీ
ఆధునిక శ్మశాన వాటికలు..
గ్రేటర్లోని 33 ప్రాంతాల్లో ఆధునిక శ్మశాన వాటికల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. రూ.46 కోట్లతో రెండు దశలుగా పనులు ప్రారంభించారు. రూ.24.13 కోట్లతో తొలి విడతలో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. శ్మశాన వాటికలకు ప్రహరీ, నీటి వసతి, బర్నింగ్ ప్లాట్ ఫామ్లు, ప్రేయర్ హాల్, వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ స్థలం, కార్యాలయం, అంత్యక్రియలకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండేలా నిర్మాణాలు, విద్యుత్దీపాలు, తాగునీరు, స్నానం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశలో రూ.21.77 కోట్లతో తొమ్మిదిచోట్ల పనులు మొదలు కాగా.. మూడు ప్రాంతాల్లో పూర్తయ్యాయి.