హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2022-01-20T22:53:15+05:30 IST
డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. వందల కోట్ల వ్యాపారం చేస్తూ డ్రగ్స్కు వ్యాపారవేత్తలు అలవాటు పడ్డారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీతో వ్యాపారులు డ్రగ్స్ తెప్పించుకున్నారు. పాతబస్తీలోని మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్ను అరెస్ట్ చేశారు. ఆనంద్, మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్కుమార్ జైన్ను అరెస్ట్ చేశారు. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో నిరంజన్కుమార్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా జైన్ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. శంషాబాద్లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈటా సర్ఫ్ను శాశవత్ జైన్ తీసుకొచ్చారు. అలాగే ఇదే కేసులో ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్యసుమంత్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలు ప్రభుత్వ కాంట్రాక్టులను చేపట్టారు.
హైదరాబాద్లో నిరంజన్జైన్, సుమంత్రెడ్డి కలిసి బ్రిడ్జిల నిర్మాణం చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవ్ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తోన్నారు. ప్రముఖ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని కూడా అరెస్ట్ చేశారు. భార్గవ్, వెంకట్లు కలిసి పార్ట్నర్స్గా ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీతో వ్యాపారవేత్తలకు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. టోనీ మనుషుల చేత వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా అన్న ప్రశ్నకు.. ఇకపై వాళ్లకు మినహాయింపు ఉండదన్నారు. నగరంలో డ్రగ్స్ వాడకమనేది ఇంటింటి సమస్యగా మారుతోందని సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది డ్రగ్స్ వినియోగ దారులను గుర్తించామన్నారు. వెయ్యి కోట్ల ఆస్తిపరుడైన కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్ 30సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. శాశ్వత్ జైన్(కన్స్ట్రక్షన్ ఫీల్డ్) యగ్యానంద్ (స్పైసెస్ బిజినెస్), సూర్య సుమంత్ రెడ్డి, బండి బార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్, ప్రైవేట్ జాబ్అల్గాని శ్రీకాంత్, ఆఫీస్ బాయ్ బాడి సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. వీరంతా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయినవారే కావడం గమనార్హం.