పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ వంటి ఆంక్షలు: డీహెచ్ శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2022-01-25T21:16:24+05:30 IST
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉన్నట్లు డీహెచ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉన్నట్లు డీహెచ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10 శాతం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందన్నారు. ముందు జాగ్రత్తగా ఈనెల 31 వరకు కరోనా ఆంక్షలు పొడిగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతోందని ఆయన తెలిపారు. 3 రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి మెడికల్ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు.
ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల ఫీవర్ బాధితులే పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. మెడికల్ కిట్స్లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని ఏజీ ప్రసాద్ పేర్కొన్నారు. మాస్కులు, భౌతికదూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. కరోనా నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితిని వివరించేందుకు విచారణకు డీహెచ్ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.