Hyd: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని Carతో ఢీ కొట్టి చంపే యత్నం

ABN , First Publish Date - 2022-07-07T17:07:54+05:30 IST

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశారు.

Hyd: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని Carతో ఢీ కొట్టి చంపే యత్నం

హైదరాబాద్ (Hyderabad): రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కారు (Car)తో ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్, రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. చింతల్ మెట్, హకీంహిల్స్ కాలనీకి చెందిన సుమియా బేగం (Sumia Begum) తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. కొంతదూరం వెళ్లగానే స్నేహితురాలు మరో రోడ్డువైపుకు మళ్ళింది. ఆమె అటువైపు వెళ్లగానే ఓ గుర్తు తెలియని కారు వేగంగా దూసుకువచ్చి సుమియా బేగంను ఢీ కొట్టింది. దీంతో ఆమె ఎగిరిపడింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.


తీవ్రంగా గాయపడి, రక్తపుమడుగులో పడి ఉన్న సుమియా బేగంను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కావాలనే వాహనంతో ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశారని సీసీ పుటేజి దృశ్యాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. యువతిపై హత్యాయత్నం జరిగినా ఆమె కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యాయత్నం జరిగినట్లు సీసీ పుటేజిలో స్పష్టంగా కనిపిస్తున్నా.. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు. యువతిపై హత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆమె ప్రియుడే కారుతో ఢీ కొట్టి చంపడానికి ప్రయత్నించాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-07-07T17:07:54+05:30 IST