Hyderabad: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ధర్మాసనం ముందుకు రాజాసింగ్
ABN , First Publish Date - 2022-08-23T23:09:43+05:30 IST
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చారు. దీంతో రాజాసింగ్ వ్యతిరేకవర్గం...
హైదరాబాద్: నాంపల్లి కోర్టు (Nampally Court) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Bjp Mla Rajasingh)ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు రాజాసింగ్ వ్యతిరేకవర్గం.. అనుకూల వర్గం భారీగా చేరుకున్నారు. రాజాసింగ్కు వ్యతిరేక, అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాగా సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమైంది. అది వైరల్ అయి దుమారం చెలరేగడంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్టు చేశారు. అయితే మంగళ్హట్ పీఎస్లో రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్ను అధిష్టానం తప్పించింది.
అయితే తన సస్పెన్షన్ను ఎమ్మెల్యే రాజాసింగ్ ముందే ఊహించారు. మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుని తీరుతామన్న రాజాసింగ్ ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ చెప్పారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని అన్నారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్షాలకు ఫాలోవర్గా ఉంటానన్నారు. పార్టీ కంటే.. ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని రాజాసింగ్ ముందే చెప్పారు.