హైదరాబాద్లో ఇలాగైతే మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతాయేమో..!?
ABN , First Publish Date - 2021-06-15T18:19:58+05:30 IST
హైదరాబాద్లో ఇలాగైతే మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతాయేమో..!?
- నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం
- పెరుగుతున్న మాస్ ట్రాన్స్పోర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి
హైదరాబాద్ సిటీ : లాక్డౌన్ నిబంధనల సడలింపుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసులు తగ్గుతున్నా, థర్డ్వేవ్ ముప్పు నేపథ్యంలో ప్రయాణి కులు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. నగరంలో మాస్ ట్రాన్స్పోర్ట్ పెరగడంతో బస్సులు, ఆటోల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని సూచిస్తున్నారు.
పక్కాగా నిబంధనలు..
సిటీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు అనుసంధానంగా నడుస్తున్న బస్సుల్లో ఇరత రాష్ర్టాలు, జిల్లాల నుంచి ప్రయాణికుల రాకపోకలు పెరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ్లలో సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్, ఉప్పల్ ప్రాంతాల గుండా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రయాణికులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ జోన్లో 29 బస్ డిపోలు 2,800 బస్సులు ఉండగా, ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 1500 పైగా బస్సులు, 11 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ రూట్లలో 2-3 అదనపు ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది. పెట్రోధరలు మండిపోతుండటంతో బస్సుల్లో ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటంతో రద్దీ పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
రక్షణ చర్యలు..
ప్రయాణికులతో కలిసి ఉండే కండక్టర్లు, డ్రైవర్ల రక్షణకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 95 శాతం మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సిబ్బందికి శానిటైజర్ బాటిల్స్, మాస్క్లను అందచేస్తున్నారు. డిపోలు, కార్యాలయాలతో పాటు బస్సులను రోజూ శానిటైజ్ చేయిస్తున్నారు. ‘బస్సుల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రయాణికుడు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నాం. రద్దీకి అనుగుణంగా బస్సు ట్రిప్పుల సంఖ్య పెంచుతున్నాం.’ అని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.