దూడకు ఘనంగా బారసాల
ABN , First Publish Date - 2022-07-05T15:56:07+05:30 IST
సైదాబాద్కు చెందిన ఓ కుటుంబం ఆవుదూడకు బారసాల వేడుకగా నిర్వహించింది. కుటుంబ సభ్యులు దానికి గణేష్ అని నామకరణం చేశారు. కొత్త వస్త్రాలు తొడిగించి
హైదరాబాద్/సైదాబాద్: సైదాబాద్కు చెందిన ఓ కుటుంబం ఆవుదూడకు బారసాల వేడుకగా నిర్వహించింది. కుటుంబ సభ్యులు దానికి గణేష్ అని నామకరణం చేశారు. కొత్త వస్త్రాలు తొడిగించి ఊయలలో వేసి ఊపుతూ సంప్రదాయబద్ధంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. సైదాబాద్ లక్ష్మినగర్ కాలనీలో అఖిల భారత గో సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ ఏడాది క్రితం పుంగనూరు నుంచి ఆవు దూడలను తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటి అలనపాలనతోపాటు గోపూజలు చేస్తున్నారు. గోవు సూడి కట్టడంతో మూడు నెలల క్రితం సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు. ఆ వేడుకలో మహిళలకు పసుపు, కుంకుమ, చీరెలు పంపిణీ చేశారు. గత నెల పుంగనూరు గోవు దూడకు జన్మనిచ్చింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, కాలనీవాసుల మధ్య ఆదివారం రాత్రి బారసాల వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.