ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. హైదరాబాద్ అంతా గులాబీమయం..
ABN , First Publish Date - 2022-04-26T11:52:07+05:30 IST
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు..
- పరిశీలించిన మంత్రి తలసాని
హైదరాబాద్ సిటీ/ మాదాపూర్ : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు, నవీన్రావు, ఎమ్మెల్యేలు మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.
తలసాని మాట్లాడుతూ జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి, అమలవుతోన్న సంక్షేమ పథకాలు కనిపించని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అనవసరంగా మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాడు బొంగరం లేనోడు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని బండి సంజయ్ను ఉద్దేశించి మాట్లాడారు. దిక్కు, మొక్కులేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.