‘నీ నంబర్ను 500 మంది పురుషులకు ఇస్తాం..’ యువతికి కేటుగాళ్ల వేధింపులు!
ABN , First Publish Date - 2022-03-10T15:01:38+05:30 IST
‘నీ ఫోన్ నంబర్ను 500 మంది పురుషులకు ఇచ్చి..
- దా‘రుణ’ దందా..
- ఇన్స్టెంట్ లోన్ కేటుగాళ్ల బెదిరింపులు
- బెంగళూరు కేంద్రంగా..
- ఆటకట్టించిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్ సిటీ : కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన యువతిని రుణం చెల్లించడం లేదంటూ కేటుగాళ్లు అసభ్య పదజాలంతో వేధించారు. తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశారు. ‘నీ ఫోన్ నంబర్ను 500 మంది పురుషులకు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేలా చేస్తాం’ అని హెచ్చరించారు. భరించలేని ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ను సంపాదించా రు. ఈ దారుణ దందాలో చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు కేం ద్రంగా నడుస్తున్న ఈ దందా ఆటకట్టించారు. చైనా నిందితుల కనుసన్నల్లో పనిచేస్తూ దేశంలో దందాను కొనసాగిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 73 ల్యాప్టాప్లు, 29 మొబైల్స్, డెబిట్ కార్డులు-2, హార్డ్ డిస్క్లు 2 స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావుభూపాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇన్స్టెంట్ లోన్ పేరుతో..
గూగుల్ ప్లేస్టోర్లో ఇన్స్టెంట్ లోన్ పేరుతో యాప్లను అప్లోడ్ చేసి నిందితులు ఈ దందాకు పాల్పడుతున్నారు. 2020, 2021లో చైనాకు చెందిన చెన్చామోపింగ్ అనే నిందితుడు బెంగళూరు కేంద్రంగా గోల్డెన్బ్యాగ్ టెక్నాలజీస్ పేరుతో ఇన్స్టంట్ దందా కొనసాగించి వేలాది మంది యువతను వేధింపులకు గురిచేశాడు. అక్రమంగా రూ. కోట్లు సంపాదించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇండియా వదిలి పారిపోయాడు. కొంతకాలం విరామం ఇచ్చిన కేటుగాడు తిరిగి ఇండియాలో తన యాప్ రుణ దందాను కొనసాగించాలని పథకం వేశాడు.
అందుకు బెంగళూరులో ఉంటున్న షబ్బీర్ ఆలం, యూపీకి చెందిన ఉమాకాంత్ యాదవ్లను సంప్రదించాడు. వారి సహకారంతో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్కై లింక్ టెక్నాలజీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. లోన్ తీసుకునేటప్పుడే రుణగ్రస్తుల ఫోన్ కాంటాక్టు లిస్టులో ఉన్న నంబర్లను మోసపూరితంగా తన యాక్సెస్లోకి తీసుకుంటున్నారు. డబ్బులు చెల్లించని వారిని వేధించడానికి, అసభ్య పదజాలంతో దూషించి వసూలు చేయడానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది టెలీకాలర్స్ను ఏర్పాటు చేసి ఈ దారుణ వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ప్రధాన నిందితులు షబ్బీర్ ఆలం, ఉమాకాంత్ యాదవ్లను అరెస్టు చేశారు.