మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉంది: టీఎంసీ ఎంపీ

ABN , First Publish Date - 2021-11-30T00:51:47+05:30 IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే వివాదాస్పద సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుపై ఎలాంటి చర్చ చేయకుండానే పార్లమెంట్ ఆమోదం పొందేలా చేసింది అధికార పార్టీ. అయితే చర్చ జరగకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి

మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉంది: టీఎంసీ ఎంపీ

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది సభ్యులు రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఇలా సస్పెండ్ అవ్వడం ఆనందంగా ఉందని సస్పెన్షన్‌కు గురైన సభ్యుల్లో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ శాంతా ఛెత్రి అన్నారు. ప్రభుత్వ నియంతృత్వంతో పాటు దేశం కోసం పని చేస్తున్న వారెవరో ప్రజలకు తెలుస్తుందని ఆమె అన్నారు. పార్లమెంట్‌లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుపై ఎలాంటి చర్చ జరగకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘చట్టాల రద్దుపై చర్చ చేయకుండా బిల్లుల ఆమోదం జరిగిపోయింది. అది వ్యతిరేకిస్తే సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జరిగిపోయింది. కానీ మేము మమతా బెనర్జీ, టీఎంసీ సైనికులం. ప్రజల కోసం పని చేస్తాము. ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో మేము అరెస్ట్ అయ్యాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు నియంతృత్వం గురించి తెలుస్తోంది’’ అని టీఎంసీ ఎంపీ శాంతా ఛెత్రి అన్నారు.


పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే వివాదాస్పద సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుపై ఎలాంటి చర్చ చేయకుండానే పార్లమెంట్ ఆమోదం పొందేలా చేసింది అధికార పార్టీ. అయితే చర్చ జరగకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో 12 మంది ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Updated Date - 2021-11-30T00:51:47+05:30 IST