నా మీద సీబీఐ, ఈడీ పనిచేయవని మోదీకి అర్థమైంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-10T20:35:26+05:30 IST

తనపై సీబీఐ, ఈడీలు పని చేయబోవని ప్రధాన మంత్రి నరేంద్ర

నా మీద సీబీఐ, ఈడీ పనిచేయవని మోదీకి అర్థమైంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : తనపై సీబీఐ, ఈడీలు పని చేయబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అర్థమైపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం చెప్పారు. ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకుంటున్నానని తెలిపారు. మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రస్తావించారు.


ప్రధాన మంత్రి మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు సంబంధిత శాఖలు వివరణ ఇచ్చాయని తెలిపారు. సభలో కూర్చొనని, వినని వ్యక్తికి తాను ఎలా సమాధానం చెప్పగలనని ప్రశ్నించారు. 


పార్లమెంటులో తన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ, మోదీ సృష్టిస్తున్న రెండు భారత దేశాల గురించి తాను మాట్లాడానని రాహుల్ గాంధీ చెప్పారు. ఒక భారత దేశం పారిశ్రామికవేత్తల కోసం, మరొక భారత దేశం పేదలు, నిరుద్యోగుల కోసం అని తాను చెప్పానన్నారు. మొదటిదానిలో పారిశ్రామికవేత్తలకు ఏది కావాలంటే అది దొరుకుతుందన్నారు. తాను చైనా గురించి కూడా మాట్లాడానన్నారు. పార్లమెంటులో మోదీ చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ గురించి తప్పులు మాట్లాడారన్నారు. ఎప్పటి మాదిరిగానే తన గురించి కూడా మాట్లాడారన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం తప్పు అంటున్నారన్నారు. తాము అధికారంలో లేమని, నరేంద్ర మోదీ తన పని తాను చేయరని అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రజలను నిరుద్యోగులుగా మార్చారన్నారు. ‘‘రాహుల్ గాంధీ వినడని మోదీ అన్నారు. దీని అర్థం ఏమిటంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాహుల్ గాంధీపై పని చేయబోవని ఆయనకు అర్థమైపోయింది. అదే ఆయన భావం’’ అన్నారు. 


‘‘ఔను. ఆయన చెప్పింది నిజమే. మోదీ మాటలను రాహుల్ గాంధీ వినడు. తాను అందరినీ ఈడీ, సీబీఐలతో బెదిరించగలనని ఆయన భావిస్తున్నారు. నేను భయపడను. ఆయన గర్వాన్ని చూసి నేను నవ్వుకుంటాను’’ అని చెప్పారు. ‘‘మోదీ మాట నేనెందుకు వినాలి?’’ అన్నారు. 


Updated Date - 2022-02-10T20:35:26+05:30 IST