కూతురి శవాన్ని ఐదేళ్లు బాత్‌రూంలో దాచిపెట్టిన తల్లి.. కోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడి..

ABN , First Publish Date - 2022-01-07T17:23:22+05:30 IST

"నా కూతుర్ని నేను చంపలేదు. ఆమె ముందే మృతిచెంది ఉంది. ఆమె మరణాన్ని బయటకు చెప్పేందుకు భయపడ్డాను అంతే.. " అంటూ ఓ తల్లి తన కూతురి మృతి విషయమై కోర్టుకు చెప్పింది.

కూతురి శవాన్ని ఐదేళ్లు బాత్‌రూంలో దాచిపెట్టిన తల్లి.. కోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడి..

కువైత్ సిటీ: "నా కూతుర్ని నేను చంపలేదు. ఆమె ముందే మృతిచెంది ఉంది. ఆమె మరణాన్ని బయటకు చెప్పేందుకు భయపడ్డాను అంతే.. " అంటూ ఓ తల్లి తన కూతురి మృతి విషయమై కోర్టుకు చెప్పింది. తాజాగా కువైత్ క్రిమినల్ కోర్టులో విచారణ దశలో ఉన్న ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్‌లో కువైత్‌లోని సాల్మియా ప్రాంతంలో పోలీసులు ఐదేళ్ల క్రితం మృతి చెందిన 21 ఏళ్ల యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే యువతి తల్లిని, ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిని విచారించారు. పోలీసుల విచారణలో.. కూతురు తన మాట వినకపోవడంతో ఆమెను ఓ గదిలో వేసి తాళం వేసినట్లు చెప్పిందా తల్లి. అలా కొన్నిరోజులు ఆమెను ఆ గదిలోనే ఉంచి ఆహారం, నీరు అందించడం చేసింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక రోజు గదిలో ఉన్న కూతురి నుంచి తల్లికి ఎలాంటి స్పందన రాలేదు. 


వెంటనే గది తలుపు తీసి చూసిన తల్లికి కుమార్తె మృతి చెంది ఉండడం కనిపించింది. దాంతో భయపడిపోయిన తల్లి అదే గదిలో ఉన్న బాత్‌రూంలో కూతురి శవాన్ని పడేసి తాళం వేసేసింది. ఈ ఘటన 2016లో జరిగింది. తన వద్దకు తరచూ వచ్చే కుమారుడితో కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. సోదరి ఎక్కడ అని అడిగితే ఏవో అబద్దాలు చెప్పి దాటవేసేది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. దాంతో అనుమానం వచ్చిన కుమారుడు ఓ రోజు తల్లిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తల్లి అసలు విషయం చెప్పింది. తన మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండడంతో గదిలో వేసి తాళం వేశానని, ఆమె అదే గదిలో చనిపోయినట్లు తెలిపింది. దాంతో ఈ విషయం బయటపడితే తనకు శిక్ష పడుతుందనే భయంతో బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు పేర్కొంది. 


తల్లి మాటలు విన్న కుమారుడికి ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాడు. అతని సమాచారంతో సాల్మియా ప్రాంతంలోని వారి ఇంటికి వచ్చిన పోలీసులు బాత్‌రూమ్ నుంచి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఎలా చనిపోయిందనే విషయాన్ని తెల్చేందుకు ఫోరెన్సిస్ అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత యువతి తల్లి, ఆమె సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు కువైత్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా "నా కూతుర్ని నేను చంపలేదు. ఆమె ముందే మృతిచెంది ఉంది. ఆమె మరణాన్ని బయటకు చెప్పేందుకు భయపడ్డాను అంతే.. " అంటూ తల్లి న్యాయస్థానంలో తన వాదనను వినిపించింది. ఆమె వాదనను విన్న క్రిమినల్ కోర్ట్ కౌన్సిలర్ అబ్దుల్లా అల్ ఒత్మాన్ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.     

Updated Date - 2022-01-07T17:23:22+05:30 IST