నా స్వరం...తయారీ లోపం: అమిత్‌షా

ABN , First Publish Date - 2022-04-05T02:10:56+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు లోక్‌సభలో కొద్దిసేపు నవ్వులు

నా స్వరం...తయారీ లోపం: అమిత్‌షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు లోక్‌సభలో కొద్దిసేపు నవ్వులు పూయించారు. బిగ్గరగే ఉండే తన స్వరంపై తానే సెటైర్ వేసుకున్నారు. ''నా స్వరం పెద్ద స్థాయిలో ఉంటుంది. పెద్దగా మాట్లాడానంటే కోపంగా ఉన్నట్టు అర్థం చేసుకోకూడదు. కశ్మీర్‌కు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు మినహా నాకెప్పుడూ కోపం రాదు'' అని అమిత్‌షా అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల చివరి వారంలో భాగంగా ''క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022''ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే ఆయన తన గొంతుపై సెటైర్ వేసుకున్నారు.


ఇప్పటికే ఆలస్యమైంది...

నేరాలపై విచారణను మరింత సమర్ధవంతంగా, శీఘ్ర గతిని జరిపేందుకు 'క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేష్ బిల్లు'  ఉద్దేశించినట్టు అమిత్‌షా చెప్పారు. ఈ బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. 1980లో ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1920ని పునఃపరిశీలించాలని లా కమిషన్ తన నివేదికలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిందని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా దానిపై చర్చ జరుగుతూనే ఉందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రాలతో తాము సంప్రదింపులు జరిపామని, వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిమినల్ చట్టాలు, నేర నిర్ధారణ ప్రక్రియలో వినియోగిస్తున్న పలు ప్రొవిజన్లను అధ్యయనం చేశామని మంత్రి తెలిపారు. పలువురు పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తారని ఆయన చెప్పారు. అన్నింటినీ క్రోడీకరించి ఈ బిల్లు తెచ్చినట్టు సభకు అమిత్‌షా తెలిపారు.

Updated Date - 2022-04-05T02:10:56+05:30 IST