ఇదా తుఫానుకు NRI బలి.. చెట్లలో దారుణంగా ఇరుక్కుపోయి..
ABN , First Publish Date - 2021-09-06T02:48:55+05:30 IST
అమెరికా తూర్పు తీరంలో విజృంభిస్తున్న ఇదా తుపానుకు ఓ ఎన్నారై బలయ్యారు. ఇదా తుఫాను కారణంగా తూర్పు తీరంలో రికార్డు స్థాయిలో..
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరంలో విజృంభిస్తున్న ఇదా తుపానుకు ఓ ఎన్నారై బలయ్యారు. ఇదా తుఫాను కారణంగా తూర్పు తీరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నదులు పొంగి పొర్లాయి. టొర్నడోలు విజృంభించాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, వాహనాలన్నీ నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ వరదల్లో దాదాపు 40 మంది వరకు ఇళ్లు, కార్లలో చిక్కుకుపోయారు.
న్యూ జెర్సీలోని సౌత్ ప్లెయిన్ఫీల్డ్ మేయర్ మ్యాట్ అనేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన ఎన్నారైని ఎడిసన్ నగరంలో నివశించే ధనుష్ రెడ్డిగా గుర్తించారు. సెప్టెంబర్ 1న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన సహాయక చర్యల్లో పిస్కాటెవే ప్రాంతంలోని సెంటెనియల్ ఎవెన్యూలోని ఓ చెట్ల గుబురులో 31ఏళ్ల ధనుష్ రెడ్డి మృత శరీరాన్ని గుర్తించారు. అవేష్ మాట్లాడుతూ.. ‘రెడ్డి మరణంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాం. ఆయనతో ఆయన కుటుంబం, స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నాం. వారితో పాటు బుధవారం తుఫాను వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడిన వారందరి సౌఖ్యం కోసం ప్రార్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు.