బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే.. పార్లమెంట్ను ముట్టడిస్తాం
ABN , First Publish Date - 2020-08-08T09:39:56+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ల లక్ష్యాన్ని నీరుగారుస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల
కవాడిగూడ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ల లక్ష్యాన్ని నీరుగారుస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ ఆరోపించారు. మండల్ డే సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద గల బీసీ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను పెంచకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రీమీలేయర్ను పూర్తిగా రద్దు చేయాలని, నీట్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని, బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్టించాలని, జాతీయ ప్రాజెక్ట్లకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు డాక్టర్ విజయభాస్కర్, కుందారం గణేషచారి, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్గౌడ్, కనకాల శ్యామ్నంద పాల్గొన్నారు.