పక్కాగా కరోనా నిబంధనలు

ABN , First Publish Date - 2021-04-21T05:02:44+05:30 IST

జిల్లాలో పక్కాగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నామని.. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు.

పక్కాగా కరోనా నిబంధనలు

 మాస్కు ధరించకపోతే రూ.వంద జరిమానా
 వివాహ వేడుకలకు 50 శాతం సామర్థ్యానికే అనుమతి
 సినిమా థియేటర్లలో సీట్ల మధ్య ఖాళీ ఉండాలి
 కలెక్టర్‌ నివాస్‌
కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20:
జిల్లాలో పక్కాగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నామని.. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజాం, పాలకొండ, టెక్కలి  ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నాటికి అందిన నివేదిక ప్రకారం జిల్లాలో కొత్తగా 1,344 కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రులకు కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలి. మాస్కు విధిగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్‌తో  చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. మాస్కు ధరించనివారికి రూ.100 అపరాధ రుసుం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వేడుకలు చేసుకోవద్దు. వివాహ వేడుకలకు 50 శాతం సామర్థ్యానికే అనుమతి ఉంది. ఈ విషయంపై  తహసీల్దారులను అప్రమత్తం చేశాం. సినిమా థియేటర్లలో సీటుకి సీటుకు మధ్య విధిగా ఖాళీ ఉండాలి. ఆసుపత్రుల్లో కొవిడ్‌ బెడ్లకు కొరత లేదు. బెడ్లను మరిన్ని పెంచుతాం. జిల్లాలో ఫీవర్‌ సర్వే జరుగుతోంది. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి’ అని కలెక్టర్‌  తెలిపారు.

శ్రీరామ నవమి వేడుకలు వద్దు
జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు ఎక్కుడా నిర్వహించవద్దని  కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనే శ్రీరామ నవమి పూజలు చేసుకోవాలని కోరారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. 

Updated Date - 2021-04-21T05:02:44+05:30 IST