క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ ఎత్తేస్తాం: ప్రహ్లాద్ జోషి

ABN , First Publish Date - 2021-12-07T17:57:15+05:30 IST

సభాకార్యక్రమాల నుంచి సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీలు క్షమాపణ చెబితే ఇవాల్టికి ఇవాళే..

క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ ఎత్తేస్తాం: ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ:  సభాకార్యక్రమాల నుంచి సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీలు క్షమాపణ చెబితే ఇవాల్టికి ఇవాళే వారిపై సస్పెన్సన్ ఎత్తివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఏ కారణంతో 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందనేది తాము చాలా స్పష్టంగా వివరించామని, వారు ఎలాంటి రభసను సృష్టించారో ప్రజలు చూశారని, రికార్డుల్లో కూడా ఉందని చెప్పారు. తమ చర్యకు క్షమాపణలు తెలియజేస్తే ఇప్పటికైనా సరే వారిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తామని మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


కాగా, పన్నెండు మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం మంగళవారంనాడు సైతం పెద్దలసభను కుదిపేసింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ సభను రాజ్యసభ చైర్మన్ వాయిదా వేశారు. గత వర్షాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజున 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి తమ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఈ విషయంలో విపక్ష ఎంపీలు రాజ్యసభలో పదేపదే నిలదీస్తుండటతో సభా కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తున్నారు.

Updated Date - 2021-12-07T17:57:15+05:30 IST