దమ్ముంటే.. కూల్చండి

ABN , First Publish Date - 2021-10-17T08:59:06+05:30 IST

ఈడీని రంగంలోకి దించి వేధించడం మానుకోవాలని, ఎదురుగా వచ్చి పోరాడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు.

దమ్ముంటే.. కూల్చండి

ఈడీకి బదులు ఎదురుగా వచ్చి పోరాడండి: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై, అక్టోబరు 16: ఈడీని రంగంలోకి దించి వేధించడం మానుకోవాలని, ఎదురుగా వచ్చి పోరాడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో రెండేళ్లు పూర్తవుతుందని, పలుసార్లు కూలగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శనివారం ముంబైలో జరిగిన దసరా ర్యాలీలో ఉద్ధవ్‌ ఠాక్రే.. బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేయడంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో మాత్రమే డ్రగ్స్‌  దొరికాయా? ముంద్రా పోర్టులో పట్టుకున్న కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ సంగతి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చిటికెడు గంజాయి పట్టుకుంటే, తమ పోలీసులు 150 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సెలెబ్రిటీలను పట్టుకోవడం వారితో ఫొటోలు దిగడంపైనే వారికి ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. భారతీయులందరి పూర్వీకులంతా ఒకరేనని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విపక్ష పార్టీలు, రైతుల పూర్వీకులు వేరే గ్రహం నుంచి వచ్చారా అని ప్రశ్నించారు. 


మీ సన్నిహితులు సాక్షులా?: నవాబ్‌ మాలిక్‌ 

నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)పై ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ సహా పలువురిని అరెస్ట్‌ చేసిన కేసులో ఇప్పటికే కొందరిని తప్పించారని ఆరోపించిన నవాబ్‌ మాలిక్‌.. ఈసారి దర్యాప్తు చేస్తున్న సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సన్నిహితులనే ఎన్‌సీబీ అధికారులు సాక్షులుగా పేర్కొన్నారంటూ వరుస ట్వీట్లలో విమర్శించారు. దీనికి సంబంధించి ఫ్లెచర్‌ పటేల్‌ అనే వ్యక్తితో సమీర్‌ వాంఖడే సోదరి జాస్మిన్‌ వాంఖడే కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. 

Updated Date - 2021-10-17T08:59:06+05:30 IST