నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా?
ABN , First Publish Date - 2022-08-19T07:25:52+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది..
రాజకీయాల కోసం దిగజారుడు ఆరోపణలు
మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే నిందలు
కాళేశ్వరం అద్భుతం అని ప్రధాని అన్నారుగా?
అప్పులివ్వడాన్ని సైతం సమర్థించారు కదా?
కేంద్ర మంత్రి షెకావత్పై మంత్రి హరీశ్ ధ్వజం
వచ్చే నెలాఖరుకు పంప్హౌస్ల పునరుద్ధరణ
మరమ్మతుల బాధ్యత ఏజెన్సీదేనని వెల్లడి
‘సత్వర’ ప్రాజెక్టులకు అదనపు నిధులివ్వండి
కేంద్రాన్ని రూ.150 కోట్లు అడిగిన తెలంగాణ
ఎందుకివ్వాలో చెప్పమన్న జలశక్తిశాఖ
వాటా నిధులు విడుదల చేయాలని సూచన
హైదరాబాద్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది.. మళ్లీ జరగబోతోందన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ తప్పుపడుతున్నందుకే కాళేశ్వరంపై బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారానికి దిగారని అన్నారు. బీజేపీ నేతల నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే.. వారికి కడుపు మండుతోందని, అందుకే అవినీతిని అంటగడుతున్నారని విమర్శించారు. నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతా..?, పార్లమెంటు సాక్షిగా మెచ్చుకుని బయటకు వచ్చి అవాస్తవాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎ్సఎల్పీలో హరీశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం. దేశానికి ఆదర్శమని కేంద్ర మంత్రులు గతంలో మెచ్చుకున్నారు. ఇప్పుడదే నోళ్లతో తప్పుగా మాట్లాడుతున్నారు. షెకావత్.. బాధ్యతారహితంగా, రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు.
ఆయనది నోరనుకోవాలా? మోరీ అనుకోవాలా..? దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా దానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పనిసరి. కాళేశ్వరం నిర్మాణానికి అనుమతులు, అప్పులిచ్చింది మీరే కదా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్శర్మ కాళేశ్వరానికి అప్పులివ్వడాన్ని గట్టిగా సమర్ధించారు. డీపీఆర్తో పాటు అన్ని విషయాలు పరిశీలించాకే అనుమతులిచ్చారు’’ అని హరీశ్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండి.. కాళేశ్వరం నిర్మించిన ఏజెన్సీకి సామర్థ్యం లేదని షెకావత్ మాట్లాడటం తగదన్నారు. ‘‘ కాళేశ్వరం నిర్మాణానికి అంతర్జాతీయ ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాం. ఈ ప్రాజెక్టు కట్టిన సంస్థనే ఏపీలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికీ పనిచేస్తోంది. బీజేపీ పాలనలోని గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఇదే సంస్థ పనిచేసింది. అక్కడ చేస్తే తప్పులేనిది.. తెలంగాణలో పని చేస్తే తప్పా?’’ అని హరీశ్ నిలదీశారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, కాళేశ్వరం నిర్మాణం ఆమోదయోగ్యమేనని .. కేంద్ర సాంకేతిక సలహా కమిటీ 2018 జూన్ 14న అనుమతించిందని హరీశ్ వివరించారు.