నానబెట్టి తింటే లాభాలెన్నో..
ABN , First Publish Date - 2022-09-17T18:38:35+05:30 IST
కంది, శనగ తదితర కాయధాన్యాలు, బాదం లాంటి నట్స్లో పోషకాలు పుష్కలం. అయితే ఇవి శరీరానికి ఎంత మేలు చేస్తాయో... సరైన పద్ధతిలో తీసుకోకపోతే అంతే హాని
కంది, శనగ తదితర కాయధాన్యాలు, బాదం లాంటి నట్స్లో పోషకాలు పుష్కలం. అయితే ఇవి శరీరానికి ఎంత మేలు చేస్తాయో... సరైన పద్ధతిలో తీసుకోకపోతే అంతే హాని కలిగిస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. సాధారణంగా వీటిని నానబెట్టి వాడుకోవడం మన భారతీయుల అలవాటు. ఇలా నానబెట్టడం వల్ల వండే సమయం తగ్గడమే కాదు... వాటిలోని పోషక విలువలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు.
నట్స్, కాయధాన్యాల పైన ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వాటి ఎదుగుదలకు ఇది అవసరం. అయితే ఈ యాసిడ్ మన శరీరంలోకి వెళ్లినప్పుడు జీర్ణ సంబంధిత, పోషకాల లోపం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఫైటిక్ యాసిడ్ మొక్కలన్నిటిలో ఉండేదే! కాకపోతే చిక్కుళ్లు, బాదం, కంది, శనగ, బఠాణీ లాంటి వాటిల్లో దాని మోతాదు అధికం. నానబెట్టడం వల్ల వీటిల్లోని టానిన్స్, పాలీఫెనాల్స్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా ఐరన్, జింక్, క్యాల్షియం వంటి మినరల్స్, ప్రొటీన్స్ను శరీరం గ్రహించడానికి వీలవుతుంది. అత్యధిక పోషక విలువలు, విటమిన్లు గల ఈ ధాన్యాలు త్వరగా జీర్ణం కావు. కనుక నానబెట్టిన తరువాత మధ్యలో రెండు మూడుసార్లు నీటిని మారిస్తే... గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తవు.