సత్కీర్తి పొందాలంటే...

ABN , First Publish Date - 2020-12-11T07:52:24+05:30 IST

ఏ సంఘటన చూసి మనిషి మనసు ఉత్తేజం పొందుతుందో చెప్పలేం. మనిషి మనసులోని అంతర్గత సంస్కారాల నుంచి అది ఏదో ఒకప్పుడు మేలుకుంటుంది. నిత్య జీవితంలో ఒక సంఘటన ఎప్పుడూ సంఘటనగానే మిగిలిపోతుంది.

సత్కీర్తి పొందాలంటే...

ఏ సంఘటన చూసి మనిషి మనసు ఉత్తేజం పొందుతుందో చెప్పలేం. మనిషి మనసులోని అంతర్గత సంస్కారాల నుంచి అది ఏదో ఒకప్పుడు మేలుకుంటుంది. నిత్య జీవితంలో ఒక సంఘటన ఎప్పుడూ సంఘటనగానే మిగిలిపోతుంది. కానీ, దాన్ని చూసినవారు... దాని నుంచి ఎలాంటి ఉత్తేజం పొందుతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వారి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. తాగుబోతు తండ్రిని చూసి ఒక బిడ్డ తాగుడు నేర్చుకుంటే, మరో బిడ్డ తాగకూడదని నిర్ణయించుకున్నట్టు... ధనరాశుల్ని చూసిన ఒక యువకుడు తీసుకున్న అసాధారణమైన నిర్ణయాన్ని తెలియజెప్పే కథ ఇది. 


పూర్వం వైశాలి నగరంలో ధననందుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. దేశ విదేశాల్లో వ్యాపారం చేసే కుటుంబం అతనిది. తాతముత్తాతల నుంచి ఒక్కొక్కరూ తరగనంత ధనాన్ని ఆర్జించారు. వారి భవనం పక్కనే విశాలమైన ధనాగారాన్ని కట్టారు. బంగారు, వెండి నాణేలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, ఆభరణాలతో వందలాది గదుల్ని నింపేశారు.


ఆ ధనవంతుడి కుమారుడు మాండవ్యుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతణ్ణి తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మాండవ్యుడు పెరిగి పెద్దవాడై, వ్యాపారంతో పాటు సర్వవిద్యలూ నేర్చాడు. ఒక రోజు ధననందుడికి హటాత్తుగా జబ్బుచేసి, మరణించాడు. అతనికి ఘనంగా ఉత్తరక్రియలు జరిపించారు. మరునాడు మాండవ్యుణ్ణి అతని తల్లి ధనాగారాలకు తీసుకువెళ్ళింది. ఒక్కొక్క గదినీ తెరిచి చూపిస్తూ-


‘‘నాయనా! ఇవి మీ ముత్తాతగారు కూడబెట్టిన ధనం ఉన్న గదులు. ఇవి మీ తాతగారు కూడబెట్టినవి. ఇవి మీ నాన్నగారివి. నీవు కూడా నీ పూర్వీకుల మాదిరిగా వ్యాపారాలు చేయాలి. ధనరాశులతో గదులను నింపాలి. మన వంశ వారసత్వాన్ని కాపాడాలి. వారిని మించిన కీర్తిని ఆర్జించాలి’’ అని చెప్పి, వ్యాపార భవనంలోకి తీసుకుపోయింది. మాండవ్యుడికి అతని తండ్రి కూర్చొనే ఆసనాన్ని చూపించింది.


మాండవ్యుడు వెళ్ళి ఆ ఆసనం మీద కూర్చున్నాడు. ధనాగారాన్ని చూసినప్పటి నుంచీ అతనికి పలు పలు రకాల ఆలోచనలు రాసాగాయి. కొంత సేపటికి ఒక గణాంకకుడు వచ్చి, మాండవ్యుడి ముందు ఒక పట్టీ ఉంచాడు. తరతరాలుగా వారి వంశంవారు ఎవరెవరు ఎన్నెన్ని ఆభరణాలు, బంగారు నాణేలు, ఏఏ సంపదలు ఎంతెత నిలువ చేసిందీ ఆ పట్టీలో వివరాలు రాసి ఉన్నాయి. రింత కల్లోలమైపోయింది. ఆలోచనల అలజడి తగ్గాక మనసు తేరుకొని తేటపడింది. అతను ఇలా ఆలోచించాడు‘‘మా తాత ముత్తాతలు, మా తండ్రిగారు ఇంత సంపదలు పోగు చేశారు. ఇప్పుడు ఈ గదుల్లో వారు కూడబెట్టిన సంపదలు ఉన్నాయి. కానీ వారెవరూ ఇప్పుడు లేరు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ధనాన్ని మా కుటుంబం వినియోగించుకున్నదీ లేదు.


పోయినవారు వారి వెంట చిల్లిగవ్వయినా పట్టుకుపోయిందీ లేదు. పోనీ, ఇంత ధనాన్ని కూడబెట్టినందుకు వారికేమైనా కీర్తి ప్రతిష్టలు లభించాయా? అంటే అవీ లేవు. సత్కీర్తిని అందించలేని ఈ సంపదలు దేనికి? ఇలా దాచిపెట్టిన ధనం వల్ల ఎవరికైనా ఒరిగేది ఏమిటి? నేను నా పూర్వీకుల మార్గంలో నడవలేను. జ్ఞానమార్గంలో శీలవంతంగా జీవించి, సత్కీర్తిని పొందాలంటే ఈ ధనాన్ని ఈ చెర నుంచీ విడిపించాలి. పదిమందికీ ఉపయోగపడేలా చెయ్యాలి. దానం చెయ్యాలి’’ అని నిర్ణయించుకున్నాడు. తన అభిప్రాయాన్ని తల్లికి చెప్పాడు. 


మరునాడు చాటింపు వేయించాడు. వచ్చిన వారందరికీ దానాలు చేశాడు. అలా వారం రోజులు దానం చేసినప్పటికీ... నాలుగోవంతు సంపదయినా తరగలేదు. ఇక అతను రాజు దగ్గరకు వెళ్ళి ‘‘మహారాజా! మిగిలిన సంపద మీకు అప్పగిస్తున్నాను. అది ప్రజలకు దానం చేయండి. రాజ్య సంక్షేమానికి వినియోగించండి. నేను ఈ రోజే గృహత్యాగం చేస్తున్నాను. సత్య, శీల, జ్ఞాన మార్గాన్వేషణకు బయలుదేరుతున్నాను’’ అని చెపాఁడు. రాజు అనుమతి తీసుకొని, ఆశ్రమాలకు వెళ్ళాడు. ధ్యానమార్గంలో విజేతగా నిలిచాడు. శీలపాలనలో అగ్రగామిగా సత్కీర్తిని పొందాడు.

 బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-12-11T07:52:24+05:30 IST