దంపతుల ఔదార్యం: రూ. 10 ఫీజుతో ట్యూషన్, మహిళలకు ఫ్రీగా ప్యాడ్స్

ABN , First Publish Date - 2020-12-03T12:48:58+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో తేయాకు తోటలు కలిగిన ఉత్తర ప్రాంతంలో ఆదివాసీ జనబాహుళ్యం అధికంగా ఉంటుంది.

దంపతుల ఔదార్యం: రూ. 10 ఫీజుతో ట్యూషన్, మహిళలకు ఫ్రీగా ప్యాడ్స్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తేయాకు తోటలు కలిగిన ఉత్తర ప్రాంతంలో ఆదివాసీ జనబాహుళ్యం అధికంగా ఉంటుంది. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో వీరు దుర్భర జీవితం సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తేయాకు తోటల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో తేయాకు తోటల్లో పనిచేసేవారి ఉపాధికి గండిపడింది. మరోవైపు వారి ఇళ్లలోని పిల్లలు చదువుసంధ్యలకు దూరమయ్యారు. అయితే ఈ ప్రాంతంలోని ప్రజల పరిస్థితులను గమనించిన ఐఐటీ దంపతుల జంట వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అనివర్ణ్ నందీ, అతని భార్య పాల్మి చాకీ నందీ ఆదివాసీయులకు తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. అనివర్ణ్ నందీ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో. పాల్మి చాకీ నందీ... సోషల్ సైన్స్, ఎకానమీలో రీసెర్చ్ అసోసియేట్. కాలేజీ బంద్ కావడంతో వీరు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దంపతులు గ్రామంలోని పిల్లలకు పది రూపాయలకే ట్యూషన్లు చెప్పడంతోపాటు, మొబైల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలను అద్దెకు ఇస్తున్నారు.


ఇదేవిధంగా గ్రామంలోని మహిళలకు ఉచితంగా శానిటర్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ ఐఐటీ దంపతుల మహత్తర కార్యక్రమం కారణంగా 25 గ్రామాలు, 20 టీ తోటల్లోని 1,800 మంది చిన్నారులకు లబ్ధి చేకూరింది. ఈ చిన్నారులలో 80 శాతం మంది బాలికలే ఉన్నారు. నందీ దంపతులు వారంలో రెండు లేదా మూడుసార్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి మహిళలు, యువతులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంటారు. ఈ సందర్భంగా పాల్మి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు వారి పీరియడ్స్ సమయంలో వస్త్రాలను వాడుతుంటారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఈ విషయం తెలుసుకున్న తాము వారికి  ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకూ సుమారు 22 వేల శానిటరీ ప్యాడ్స్ అందించామని తెలిపారు. ఇదేవిధంగా ఈ ప్రాంతంలోని చిన్నారులకు వివిధ సబ్జెక్టులలో ట్యూషన్ చెప్పాలని నిర్ణయించుకున్నామని, ఉచితంగా ట్యూషన్ చెబుతామంటే ఎవరూ రావడం లేదని, అందుకే కేవలం 10 రూపాయల ఫీజుతో వారికి ట్యూషన్లు చెబుతున్నామని తెలిపారు. ఈ ట్యూషన్లకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. ఈ దంపతుల ఔదార్యాన్ని తెలుసుకున్నవారంతా వారిని అభినందలతో ముంచెత్తుతున్నారు.


Updated Date - 2020-12-03T12:48:58+05:30 IST