వచ్చే 5 రోజుల పాటు భారీవర్షాలు...IMD issues orange alert
ABN , First Publish Date - 2022-07-05T13:27:22+05:30 IST
మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని...
ముంబయి:మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీవర్షాల వల్ల మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో భారీ వరదలు వెల్లువెత్తే అవకాశాలుండటంతో తీరప్రాంత కొంకణ్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రెండు బృందాలను మోహరించినట్లు ఒక అధికారి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రత్నగిరి జిల్లాలోని చిప్లూన్లో,మరో బృందం రాయ్గఢ్ జిల్లాలోని మహద్లో ఉంది.జూన్ 4 నుంచి జూన్ 8వతేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ముంబై, థానే జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు,కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పాల్ఘర్ జిల్లాలో వచ్చే రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్, ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ముంబైలో భారీ వర్షాలు కురిశాయి.సోమవారం ముంబయి నగరంలో కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సియోన్ రోడ్లు వరదనీటిలో మునిగాయి.