వ్యవసాయరంగానికి ఐఎండీ శుభవార్త

ABN , First Publish Date - 2022-04-14T21:11:04+05:30 IST

న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) దేశ వ్యవసాయరంగానికి చల్లటి కబురుచెప్పింది. ప్రస్తుత ఏడాది 2022లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

వ్యవసాయరంగానికి ఐఎండీ శుభవార్త

న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) దేశ వ్యవసాయరంగానికి చల్లటి కబురుచెప్పింది. ప్రస్తుత ఏడాది 2022లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలోని అత్యధిక భాగాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయని రైతన్నలకు సంకేతాలిచ్చింది. ఈ మేరకు గురువారం ఒక రిపోర్ట్‌ను ఐఎండీ విడుదల చేసింది. వర్షపాతం దీర్ఘకాల సగటు(ఎల్‌పీఏ)లో 99 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అయితే అంచనాలో ప్లస్ లేదా మైనస్ 5 శాతాన్ని దోషంగా భావించాలని వివరించింది. ఈశాన్య భారతంతోపాటు వాయువ్యం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వొచ్చని విశ్లేషించింది. అయితే ఈ తక్కువ వర్షపాతం వ్యవసాయరంగ కార్యకలాపాలను ఏమాత్రం ప్రభావితం చేయబోదని స్పష్టం చేసింది. దేశంలోని అత్యధిక ప్రాంతాలు సాధారణ వర్షపాతాన్ని పొందనుండడమే ఇందుకు కారణమని వివరించింది.


ఇక ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనే విషయానికి వస్తే.. 2022లో సాధారణ వర్షపాతం నమోదయ్యేందుకు 40 శాతం అవకాశాలున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యేందుకు 26 శాతం ఛాన్స్ ఉంది. ఇక లోటు వర్షపాతం నమోదయ్యేందుకు 14 శాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 15 శాతం, అతివర్షపాతం నమోదయ్యేందుకు 5 శాతం అవకాశాలున్నాయని ఐంఎండీ లెక్కగట్టింది.


Updated Date - 2022-04-14T21:11:04+05:30 IST